జీతంలో రూ.3లక్షల వరకు పన్నులు, కోతల రూపంలో పోతుంది
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వ్యాఖ్యలు వైరల్
కాన్పూర్ : రాష్ట్రపతి హోదాలో తన జీతం, కట్టింగ్ల గురించి రామ్నాథ్ కోవింద్ మాట్లాడడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఆర్థిక చట్టంలో చేసిన సవరణ తరువాత భారత రాష్ట్రపతి నెలవారి జీతం జనవరి 1, 2016 నుండి రూ.5 లక్షలు. అదే సమయంలో రాష్ట్రాల గవర్నర్కు ప్రతి నెలా రూ.3,50,000ను వేతనంగా ప్రభుత్వం అందిస్తుంది. రాష్ట్రపతి తన భార్యతో కలిసి మొదటిసారి రైలులో కాన్పూర్ వెళ్లగా ఈ సమయంలో రాష్ట్రపతికి జీతానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జింఝాక్ అనే పట్టణంలో జరిగిన ఓ సదస్సులో మాట్లాడుతూ.. ‘దేశంలోనే అత్యధిక జీతం తీసుకునే వ్యక్తిని నేను. నా నెల సంపాదన రూ.5లక్షలు. కానీ అందులో 3 లక్షల దాకా ట్యాక్స్, కట్టింగ్ల రూపంలో పోతుంది. ఆ లెక్కన నాకు మిగిలేది తక్కువే. అంటే మిగిలినవాళ్ల కంటే నేనేం బెటర్ కాదు. ఒక టీచర్ నాకంటే ఎక్కువే సేవింగ్స్ చేస్తున్నాడు’ అంటూ సరదాగా నవ్వుతూ ఓ సభలో మాట్లాడారు.
ఈ వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాష్ట్రపతి జీతంలో ట్యాక్స్ కట్టింగ్లు ఉండవంటూ కొందరు వాదిస్తుంటే, మరికొందరేమో రాజ్యాంగంలోని ప్రతులంటూ కొన్ని ఆధారాలను ట్విటర్లో పోస్ట్ చేస్తున్నారు. పెన్షన్ యాక్ట్ 1951 ప్రకారం.. రాష్ట్రపతి జీతంపై పన్ను విధించరని చెప్తున్నారు. అయితే అదంతా ఉత్తదేనని, రాష్ట్రపతి జీతంలో కట్టింగ్లు ఉంటాయని మరికొందరు వాదిస్తున్నారు. గతేడాది కరోనా టైంలో జీతాల్లో 30శాతం వరకు త్యాగం చేసినవాళ్లలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కూడా ఉన్నారు. ఇక రాష్ట్రపతి వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. రాష్ట్రపతి జీతంపై పన్నులు విధించరని, అలాంటప్పుడ ఆయన అసత్యాలు ఎందుకు చెబుతున్నారని పలువురు నెటిజన్లు ప్రశ్నించారు. మరికొందరు ఆయన వ్యాఖ్యలపై విచారణ జరపాలని డిమాండ్ కామెంట్ చేశారు. మరికొందరు చట్టం అందరికీ సమానమేనని, మొదటి పౌరుడు కూడా దానికి మినహాయింపు కాదని పేర్కొనారు.