Monday, May 6, 2024

జూన్ 12న టెట్ పరీక్ష..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయుల నియామకానికి ముందు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 26 నుంచి ఏప్రిల్ 12 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వెల్లడించింది. జూన్ 12వ తేదీన టెట్ పరీక్ష జరుగుతుంది. ఈ మేరకు ఎస్‌సిఇఆర్‌టి డైరెక్టర్ రాధారెడ్డి నోటిఫికేషన్ విడుదల చేశారు. శుక్రవారం(మార్చి25) నుంచి www.tstet.cgg.gov.in వెబ్‌సైట్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా టెట్ నిర్వహించాలని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా బుధవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు ఆదేశించగా, ఒకరోజు వ్యవధిలో టెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
టెట్‌లో తాజాగా చేసిన మార్పులు
ఇప్పటివరకు బి.ఇడి అభ్యర్థులు 6 నుంచి 10 తరగతులు బోధించేందుకు మాత్రమే అర్హులు. అందుకు టెట్‌లో పేపర్ 2 రాసేవారు. ఇక నుంచి వారు 1 నుంచి 5 తరగతులకు బోధించేందుకు సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియమితులు కావొచ్చు. అంటే వారు టెట్‌లో పేపర్ 1 కూడా రాయవచ్చు. కాకపోతే ఉద్యోగంలో చేరిన రెండేళ్లలోపు ప్రాథమిక విద్య బోధనలో ఆరు నెలల బ్రిడ్జి కోర్సు పూర్తి చేయాలి. ఇప్పటివరకు పేపర్ 1కు కేవలం డి.ఇడి వారు మాత్రమే అర్హులు.
ఒకసారి అర్హత సాధిస్తే శాశ్వత వ్యాలిడిటీ
ఒకసారి టెట్‌లో అర్హత సాధిస్తే ఆ ధృవపత్రానికి ఇప్పటివరకు ఏడేళ్ల కాలపరిమితి ఉండేది. ఆ తర్వాత దానికి విలువ ఉండదు. మళ్లీ టెట్ రాసుకోవాల్సిందే. అందుకు భిన్నంగా ఒకసారి టెట్‌లో అర్హత సాధిస్తే జీవిత కాలం విలువ ఉండేలా మార్పు చేయాలని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్(ఎన్‌సిటిఇ) రెండేళ్ల క్రితమే నిర్ణయించింది. అందుకు అనుగుణంగా మార్పులు చేస్తూ విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 2011 ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ఆ మార్పు వర్తిస్తుంది. అప్పటినుంచి జరిగిన టెట్‌లో అర్హత సాధించిన వారి ధృవపత్రం ఇప్పుడూ చెల్లుబాటవుతుంది. రాష్ట్రంలో ఇప్పటికే టెట్ పాసైన వారు సుమారు 3 లక్షల మంది ఉంటారని అంచనా. టెట్‌ను 150 మార్కులకు నిర్వహిస్తారు. జనరల్ కేటగిరీ విద్యార్థులకు 90 మార్కులు (60 శాతం), బిసిలకు 75 మార్కులు (50 శాతం), ఎస్‌సి, ఎస్‌టి,వికలాంగుకు 60 మార్కులు (40 శాతం) మార్కులు వస్తే అర్హత సాధించినట్లుగా పరిగణిస్తారు. టెట్‌లో వచ్చిన మార్కులకు ఉపాధ్యాయ నియామకాల్లో భాగంగా నిర్వహించే పరీక్షలకు 20 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకు కేటాయిస్తారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత మూడో సారి
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టెట్ నిర్వహించడం ఇది మూడోసారి. గతంలో 2016 మే, 2017 జులైలో టెట్ పరీక్ష నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 4 సార్లు, తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు సార్లు టెట్ జరిగింది. ఉమ్మడి రాష్ట్రంతో కలిపి మొత్తం ఆరు సార్లు టెట్ నిర్వహించారు. చివరగా 2017 జూలై 23న టెట్ నిర్వహించగా, అప్పటి నుంచి ఇప్పటివరకు టెట్ పరీక్ష జరగలేదు. రాష్ట్రంలో టెట్ పరీక్షకు సుమారు 3 లక్షలపైగానే అభ్యర్థులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.

TET Exam 2022 to conduct on June 12 in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News