వెనక్కు తగ్గిన కాంగ్రెస్
ముంబై : మహారాష్ట్రలోని 9 ఎమ్ఎల్సి స్థానాలకు ఈనెల 21న ఎన్నికలు జరగనుండగా కాంగ్రెస్ తన అభ్యర్థిని ఉపసంహరించుకోవడంతో ఎమ్ఎల్సిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఏకగ్రీవంగా ఎన్నిక కాడానికి మార్గం సుగమమైంది. శివసేన మిత్రపక్షమైన కాంగ్రెస్ తాను పోటీలో ఉంచిన అభ్యర్థుల్లో ఒకరిని పోటీ నుంచి విరమించినట్టు ఆదివారం ప్రకటించింది. కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేసిన రాజ్ కిషోర్ మోదీ తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. దీంతో ఉద్ధవ్కు పెద్ద ఊరట కలిగింది. మొదట రాజ్ కిషోర్, రాజేష్ రాథోడ్లను కాంగ్రెస్ పోటీలో ఉంచింది. దీంతో ఉన్న 9 స్థానాలకు పదిమంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్టవుతుంది. ఎన్నికలు అనివార్యమవుతాయి. శివసేన నేత సంజయ్ రౌత్ మొదట ఏకగ్రీవం అయితే తప్ప థాకరే పోటీ చేయడానికి ఇష్టపడడం లేదని ప్రకటించారు. కానీ కాంగ్రెస్ వెనక్కు తగ్గడంతో థాకరేకు అడ్డుతొలగింది. మహావికాస్ అగాధీ లో( శివసేన,ఎన్సిపి, కాంగ్రెస్) భాగమైన కాంగ్రెస్ ఒక్కరినే బరి లోకి దింపాలని నిర్ణయించడంతో థాకరే ఏకగ్రీవంగా ఎన్నికవుతారు.