అలహాబాద్ హైకోర్టు స్పష్టీకరణ
మతాంతర వివాహంలో తీర్పు
అలహాబాద్: జీవితభాగస్వామిని ఎంచుకునే హక్కు మతాలకు అతీతమని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ హక్కు రాజ్యాంగంలోని అధికరణం 21లోని జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛలో అంతర్భాగమని జస్టిస్ పంకజ్నఖ్వీ, జస్టిస్ వివేక్ అగర్వాల్తో కూడిన హైకోర్టు ధర్మాసనం పేర్కొన్నది. హిందూ యువతిని వివాహమాడిన ఓ ముస్లిం యువకుడిపై నమోదైన కేసు విచారణలో హైకోర్టు ఈ తీర్పును వెల్లడించింది. ఉత్తర్ప్రదేశ్లోని కుషీనగర్కు చెందిన సలామత్ అన్సారీ, ప్రియాంక ఖర్వర్ 2019 ఆగస్టులో వివాహం చేసుకున్నారు.
పెళ్లికి ముందు ప్రియాంక మతం మారారు. ఆమె తన పేరును ఆలియాగా మార్చుకున్నారు. ఈ పెళ్లిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రియాంక తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన కుమార్తె మైనర్ అని, బలవంతంగా మతమార్పిడి జరిపి పెళ్లి చేశారని ఆరోపిస్తూ సలామత్తోపాటు మరో ముగ్గురిపై పోస్కో చట్టం కింద కేసు పెట్టారు. దాంతో, సలామత్, ప్రియాంక కోర్టును ఆశ్రయించి తమకు రక్షణ కల్పించమని కోరారు. ఈ కేసులో ఇద్దరూ మేజర్లు అయినందున పోస్కో చట్టం వర్తించదని, వారు ఇష్టప్రకారం పెళ్లి చేసుకునే హక్కు ఉన్నదని, అందుకు నిరాకరించే అధికారం ఎవరికీ లేదని హైకోర్టు స్పష్టం చేసింది.