Saturday, April 27, 2024

అయిటిపాముల ఎస్‌బిఐ ఎటిఎంలో చోరీ

- Advertisement -
- Advertisement -

నల్లగొండ:నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల గ్రామపంచాయతీ పరిధిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఎటిఎంలో రూ.23 లక్షల సొమ్ము చోరీకి గురైన సంఘటన ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.ఎస్‌బిఐ అయిటిపాముల బ్రాంచ్ మేనేజర్ వెంపటి రాంబాబు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అయిటిపాముల ఎస్‌బిఐకి చెందిన ఎటిఎంలోని రెండు మిషన్లలో డబ్బులు ఉండగా, దుండగులు ఎటిఎంలోని సిసి కెమెరాలను, ఎటిఎం మిషన్‌ను పగలగొట్టి, అందులోని ఒక మిషన్‌లో నుండి రూ.23 లక్షల 16 వేల రూపాయలను చోరీ చేశారు.

కాగా మరో మిషన్‌ను పగులగొట్టేందుకు విఫలయత్నం చేసినప్పటికీ వారి ప్రయత్నం సఫలం కాలేదు. కాగా బ్యాంకుకు శనివారం, ఆదివారం వరుస సెలవులు కావడంతో దొంగలు పక్కా ప్రణాళికలతోనే ఈ చోరీకి పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఈ సంఘటన ఆదివారం తెల్లవారు జామున 2:30 గంటల నుండి 3:00 గంటల సమయంలో జరిగినట్లు సమాచారం. నల్లగొండ డిఎస్‌పి నర్సింహ్మారెడ్డి, అడిషనల్ ఎస్‌పి ప్రసాద్, పోలీస్ సిబ్బంది సంఘటన స్థలాన్ని ఆదివారం మధ్యాహ్నం పరిశీలించారు.

అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శాలిగౌరారం సిఐ ఆధ్వర్యంలో నేరస్తుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాగా, ఈ చోరీలో ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నట్లు, వారు పవర్ గ్యాస్ కట్టర్లతో ఈ చోరీకి పాల్పడినట్లు సమాచారం. ఈ మేరకు శాలిగౌరారం సిఐ పర్యవేక్షణలో కట్టంగూర్ ఏఎస్‌ఐ అంజాద్ అలీ కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News