ముంబై: ఐపిఎల్ సీజన్14లో తొలి విజయం కోసం రాజస్థాన్ రాయల్స్ సమరోత్సాహంతో సిద్ధమైంది. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో అసాధారణ పోరాట పటిమను కనబరిచినా స్వల్ప తేడాతో ఓటమి పాలైన రాజస్థాన్ గురువారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగే మ్యాచ్లో గెలుపే లక్షంగా పెట్టుకుంది. ఈ మ్యాచ్లో గెలిచి తొలి విజయాన్ని అందుకోవాలని తహతహలాడుతోంది. పంజాబ్పై చారిత్రక ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ సంజు శాంసన్ ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇక తొలి మ్యాచ్లో చెన్నై సూపర్కింగ్స్ను ఓడించిన ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఆత్మవిశ్వాసంతో మ్యాచ్కు సిద్ధమైంది. ఈ మ్యాచ్లో కూడా గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తోంది. బ్యాటింగ్, విభాగాల్లో రెండు జట్లు కూడా సమతూకంగానే కనిపిస్తున్నాయి. రెండు జట్లలోనూ ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు కొదవలేదు. రిషబ్ పంత్, పృథ్వీషా, శిఖర్ ధావన్, స్టోయినిస్, రహానె తదితరులతో ఢిల్లీ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది.
అంతేగాక అశ్విన్, అవేజ్ ఖాన్, క్రిస్వోక్స్, టామ్ కరన్ తదితరులతో బౌలింగ్ కూడా పటిష్టంగా కనిపిస్తోంది. అంతేగాక చెన్నై వంటి బలమైన జట్టును అలవోకగా ఓడించడంతో ఢిల్లీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. కిందటి మ్యాచ్లో అసాధారణ బ్యాటింగ్తో అలరించిన ఓపెనర్లు పృథ్వీషా, శిఖర్ ధావన్లపై జట్టు మరోసారి భారీ ఆశలు పెట్టుకుంది. ఇద్దరు ఫామ్లో ఉండడం ఢిల్లీకి కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. ధావన్ తన మార్క్ బ్యాటింగ్తో అలరిస్తే ఢిల్లీని కట్టడి చేయడం ప్రత్యర్థి బౌలర్లకు పెద్ద కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక రిషబ్ పంత్ కూడా మెరుపులు మెరిపించేందుకు సిద్ధంగా ఉన్నాడు. పంత్ కూడా చెలరేగితే ఈ మ్యాచ్లో కూడా ఢిల్లీ గెలుపు ఖాయం.
తక్కువ అంచనా వేయలేం..
మరోవైపు మొదటి మ్యాచ్లో పోరాడి ఓడిన రాజస్థాన్ను కూడా తక్కువ అంచనా వేయలేం. సంజు శాంసన్, బెన్స్టోక్స్, రియాన్ పరాగ్, జోస్ బట్లర్, తెవాటియా వంటి విధ్వంసక బ్యాట్స్మెన్ రాజస్థాన్కు అందుబాటులో ఉన్నారు. పంజాబ్తో జరిగిన పోరులో స్టోక్స్ విఫలం కావడం, బట్లర్ తక్కువ స్కోరుకే పరిమితం కావడం రాజస్థాన్పై ప్రభావం చూపింది. కానీ ఈసారి వీరిద్దరూ తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే రాజస్థాన్ బ్యాటింగ్ కష్టాలు చాలా వరకు తీరిపోతాయి. ఇక కిందటి మ్యాచ్లో కళ్లు చెదిరే శతకం సాధించిన కెప్టెన్ సంజు శాంసన్పై జట్టు మరోసారి భారీ ఆశలు పెట్టుకుంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన శాంసన్ విజృంభిస్తే ఢిల్లీ బౌలర్లకు కష్టాలు తప్పక పోవచ్చు. ఇక పరాగ్, తెవాటియా, మన్నాన్ వోహ్రా తదితరులతో జట్టు బ్యాటింగ్ బలంగానే ఉంది. అయితే తొలి మ్యాచ్లో స్టార్ ఆల్రౌండర్ క్రిస్ మోరిస్ వైఫల్యం జట్టును వెంటాడుతోంది. కోట్లాది రూపాయలు చెల్లించి సొంతం చేసుకున్న మోరిస్ తొలి మ్యాచ్లో పేలవమైన ఆటతో నిరాశ పరిచాడు. ఈ మ్యాచ్లోనైనా అతను తన స్థాయికి తగ్గ ఆటను కనబరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.