Wednesday, May 1, 2024

తెలంగాణ సాధనలో తెరాస పాత్ర

- Advertisement -
- Advertisement -

TRS role in Telangana State formation

 

తెలంగాణ రాష్ట్ర చరిత్ర లో ఏప్రిల్ 27 మరిచిపోలేని రోజు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా తె.రా.స పార్టీ ఆవిర్భవించిన రోజు. ఆనాడు కెసిఆర్ మరి కొందరి భాగస్వామ్యంతో తె.రా.స ఉద్యమ పార్టీ ఏర్పాటు జరగకపోతే, నేటి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తెలంగాణ ప్రజల చిరకాల వాంఛితంగానే మిగిలి పోయి ఉండేదేమో. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన తొలి దశలో ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమం స్వార్థ ప్రయోజనాల కారణంగా చల్లారిపోగా, మలి దశ ఉద్యమం కెసిఆర్ సమర్థ నాయకత్వం, వ్యూహాత్మక ఎత్తుగడలు, ప్రణాళికాబద్ధమైన కార్యక్రమాలు, రాజకీయ జెఎసి ఏర్పాటు, ఉద్యోగ, స్వచ్ఛంద సంస్థల తోడ్పాటు, గ్రామ గ్రామాన ఉద్యమ రూపాలు, ప్రధానంగా ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యాన్ని కల్పించిన నేపథ్యం వెరసి లక్ష్య సాధనకు దోహదం అయింది.

తొలిదశ తెలంగాణ ఉద్యమం, మలిదశలో తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ ప్రారంభించిన కార్యక్రమాలు కెసిఆర్ పై తొలగని ప్రభావం చూపాయి. 2001లో కొత్తగా ఉత్తరాఖండ్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల ఏర్పాటు నేపథ్యం తెలంగాణ ఏర్పాటు సాధ్యాసాధ్యాల గురించి చర్చలకు తెర లేపాయి. ఈ క్రమంలోనే తెలంగాణ ఉద్యమకారులతో ఏర్పాటు చేసిన సమావేశాల్లో రాష్ట్ర సాధన ఉద్యమం గురించి కెసిఆర్ విస్తృతంగా చర్చించారు. ఫలితంగా ప్రజల మనోభావాలకు అనుగుణంగా, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటు చేయాలన్న ఆలోచనను బలపరిచాయి.

ఫలితంగా, 2001 ఏప్రిల్ 27న కల్వకుంట్ల చంద్రశేఖరరావు అప్పటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి పదవికి, శాసనసభా సభ్యత్వానికి, తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి, తన ఆలోచనలతో ఏకీభవించిన కొందరు నాయకులతో కలిసి తెరాసను ఏర్పాటు చేశారు. నిజాం మనుమరాలు సలీమా బాషా (అస్మత్ బాషా కుమా ర్తె), ఆమె కుమార్తె రఫత్ షా ఆజంపురాలు తెలంగాణకు మద్దతు ప్రకటించారు. పాతబస్తీలోని ముస్లిం వర్గాలు తెలంగాణకు వ్యతిరేకం కాదని అన్నారు. 2001 ఏప్రిల్ 27న కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం జలదృశ్యంలో టిఆర్‌ఎస్ పార్టీ పురుడు పోసుకుంది. సుదర్శన్ రావు, నాయిని నర్సింహారెడ్డి, హన్మంతరావు, గాదె ఇన్నయ్య, వి. ప్రకాశ్, నిమ్మ నర్సింహారెడ్డి, నారాయణరెడ్డి, గొట్టె భూపతి, మందాడి సత్యనారాయణరెడ్డి, హరీశ్ రావు తదితరులు ఆనాటి కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఉన్నారు. సుమారు ఏడాదికి పైగా జలదృశ్యం లోనే టిఆర్‌ఎస్ పార్టీ కార్యకలాపాలు సాగాయి.

2001 మే 17న కరీంనగర్ ఎస్ ఆర్‌ఆర్ కాలేజీ గ్రౌండ్‌లో నిర్వహించిన బహిరంగ సభ ఉమ్మడి ఎపి రాజకీయాల్లో పెను మార్పులకు బీజం వేసింది. జెఎంఎం చీఫ్, అప్పటి జార్ఖండ్ సిఎం శిబూ సోరెన్ ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొన్ని రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకలాపాలు నందినగర్, హైదరాబాద్‌లోని కెసిఆర్ నివాసానికి మారాయి. ఆరు నెలల తర్వా త ఎమ్మెల్యే కాలనీలోని మాజీ మంత్రి వేదంతరావు ఇంటికి పార్టీ కార్యాలయాన్ని మార్చా రు. 2004లో వైఎస్ ప్రభుత్వం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో ప్రస్తుతం తెలంగాణ భవన్ ఉన్న స్థలాన్ని టిఆర్‌ఎస్‌కు కేటాయించింది. రేకుల షెడ్డు వేసి టిఆర్‌ఎస్ పార్టీ ఆఫీసు నిర్మాణాన్ని ప్రారంభించారు. 2006 లో తెలంగాణ భవన్‌ను ప్రారంభించారు.

పార్టీకి సైద్ధాంతిక భూమిక కల్పించడం దగ్గర్నుంచి కార్యాచరణను నిర్దేశించడం వర కు, తెలంగాణ సమాజాన్ని, దేశ రాజకీయ వ్యవస్థ స్వభావాన్నిలోతుగా అధ్యయనం చేసి, అర్థం చేసుకుని, తెలంగాణ ఉద్యమ వ్యూహానికి రూపకల్పన చేశారు కెసిఆర్. స్ట్రీట్ ఫైట్ స్థానంలో స్టేట్ ఫైట్ ఉండాలని భావించి, అం దుకు వాహకంగా తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్)ని ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దారు.

2004లో టిఆర్‌ఎస్ కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల పొత్తు పెట్టుకుని, టిఆర్‌ఎస్ 26 మంది ఎమ్మెల్యేలను, 5 మంది ఎంపిలను గెలుచుకుంది. తద్వారా శాసనసభ, లోక్‌సభలలో స్థానాలను పొందింది. టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ కేంద్ర మంత్రిగా కొంతకాలం పని చేశారు. కొంత కాలం పోర్ట్‌ఫోలియో లేకుండా కూడా కొనసాగారు. 2006 లో తన మంత్రిత్వ శాఖకు రాజీనామా చేశారు. సెప్టెంబర్ 2006లో కెసిఆర్ కరీంనగర్ లోక్‌సభకు రాజీనామా చేసి ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలిచారు. ఏప్రిల్ 2008 లో, టిఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలచే రాజీనామా చేయించి, రాష్ట్ర ప్రభుత్వం నుండి వైదొలిగారు. కానీ, ఈ ఉప ఎన్నికలో టిఆర్‌ఎస్ 7 ఎమ్మెల్యే, 2 లోక్‌సభ స్థానాలను మాత్రమే నిలుపుకో గలిగింది. 2009 ఎన్నికలలో టిడిపి పొత్తుతో టిఆర్‌ఎస్ 10 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపి సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది.

తెలంగాణ రాష్ట్ర సమితి 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు, నాటి కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో కరీంనగర్‌లో ప్రత్యేక తెలంగాణ ఇస్తామని ప్రకటింపజేయడం, రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని చేర్చడం, యుపి ఎ కనీస ఉమ్మడి ప్రణాళిక (కామన్ మినిమమ్ ప్రోగ్రాం)లో తెలంగాణ అంశం చేర్చడంలో టిఆర్‌ఎస్ విజయం సాధించింది. తెలంగాణకు అనుకూలంగా దాదాపు 36 పార్టీలు లేఖ ఇవ్వడంలో ఢిల్లీ వేదికగా టిఆర్‌ఎస్ పార్టీ కృషి చేసింది. ‘కెసిఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో” అంటూ కెసిఆర్ నవంబర్ 29, 2009 న, కెసిఆర్ నిరవధిక నిరాహార దీక్షను చేపట్టారు. ఆయన దీక్షతో తెలంగాణలో ఉద్యమం ఉధృతం అయింది. డిసెంబర్ 7న అఖిలపక్ష సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. దీంతో దిగివచ్చిన యుపిఎ 2 ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు దిశగా ప్రక్రియ ప్రారంభిస్తామంటూ 2009 డిసెంబర్ 9న ఒక ప్రకటన చేసింది. కానీ, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో డిసెంబర్ 23న ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. తెలంగాణ ఏర్పాటుపై అందరి అభిప్రాయాలను సేకరించేందుకు శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది.

తెలంగాణ జెఎసి, అనేక సంస్థలు, ప్రొఫెసర్ కోదండరం దాని చైర్మన్‌గా టిజెఎసి ప్రారంభించిన పలు ఆందోళనలు, నిరసనలలో టిఆర్‌ఎస్ గ్రామ స్థాయి నుండి చురుకుగా పాల్గొన్నారు. ఈ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ ప్రత్యేక తెలంగాణ కోసం కేంద్రంపై ఒత్తిడిని తీవ్రం చేసింది. 2010 డిసెంబర్ 16న వరంగల్‌లో టిఆర్‌ఎస్ తలపెట్టిన మహా గర్జనకు 20 లక్షల మంది హాజరు అయ్యారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పణ తర్వాత 2011 జనవరి నుండి టిఆర్‌ఎస్ అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగా 2013 అక్టోబర్‌లో తెలంగాణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

2014 ఫిబ్రవరి 18న లోక్‌సభ, 20న రాజ్యసభ ఆమోదం తెలిపింది. మరో వైపు 2014 ఏప్రిల్‌లో సాధారణ ఎన్నికలు జరుగగా, మే 16న ఫలితాలు వచ్చాయి. తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు గాను టిఆర్‌ఎస్ 63, 11 లోక్‌సభ స్థానాలను గెలుపొందింది. దీంతో తెలంగాణలో జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావంతో పాటు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కెసిఆర్ ప్రమాణ స్వీకారం చేశారు.

2018 డిసెంబరు 7 న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ 88 స్థానాల్లో గెలుపొంది ఘన విజయం సాధించి, డిసెంబరు 13 గురువారం మధ్యాహ్నం 1:25 నిమిషాలకు రాజ్ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కెసిఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. మలి సారి పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ధ్యేయంగా పార్టీని స్థాపించిన ఉద్యమ నేత కెసిఆర్ రెండు సార్లు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా స్వయం పాలనా పగ్గాలు చేపట్టారు. తెలంగాణలోని సంఘాలు, విద్యార్థులు, రాజకీయ నేతల సహాయంతో ఉధృతంగా ఉద్యమం చేసి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన టిఆర్‌ఎస్, ఎన్నో ఆటుపోట్లను చవిచూసింది. ఎందరో పార్టీని వీడి వెళ్ళారు. ఎందరో చేరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పూర్తి స్థాయి బలమైన రాజకీయ పార్టీగా మారింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News