Saturday, April 27, 2024

స్థానికులకే సీట్లు

- Advertisement -
- Advertisement -

ఎంబిబిఎస్ బీ కేటగిరీ సీట్లలో 85 శాతం లోకల్ రిజర్వేషన్ 
వెయ్యికి పైగా ఎంబిబిఎస్ సీట్లు తెలంగాణ విద్యార్థులకే, ఇకపై కేవలం 15% ఓపెన్ కోటా 
ఎంబిబిఎస్, బిడిఎస్ అడ్మిషన్ల నిబంధనలు సవరిస్తూ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు 
డాక్టర్ చదవాలనుకునే స్థానిక విద్యార్థులకు పెరగనున్న అవకాశాలు

రాష్ట్ర విద్యార్థులకే మెజారిటీ సీట్లు లభించేలా సర్కారు నిర్ణయం

మనతెలంగాణ/హైదరాబాద్: స్వరాష్ట్రంలో ఉంటూ వైద్య విద్యను అభ్యసరించాలనుకునే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మైనారిటీ, నాన్ మైనారిటీ మెడికల్ కాలేజీల్లో ఎంబిబిఎస్, బిడిఎస్- బి కేటగిరీ సీట్లలో కేటాయించే 35 శాతం సీట్లలో 85శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కేలా ప్రవేశాల నిబంధనలు సవరిస్తూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గురువారం జీవో నెంబర్ 129, 130లను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలోని మొత్తం 24 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 1,068 ఎంబిబిఎస్ సీట్లు అదనంగా తెలంగాణ విద్యార్థులకే లభించనున్నా యి. రాష్ట్రంలో 20 నాన్ మైనారిటీ, 4 మైనారిటీ ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో మొత్తం 3,750 సీట్లు అందుబాటులో ఉన్నాయి. నాన్ మైనార్టీ కాలేజీల్లో 3,200 సీట్లు ఉండగా ఇందులో బీ కేటగిరీ కింద 35 శాతం అంటే 1,120 సీట్లు ఉన్నాయి. ఇప్పటివరకు ఈ సీట్లకు అన్ని రాష్ట్రాల విద్యార్థులు అర్హులుగా ఉన్నారు. తాజా సవరణ మేరకు బి కేటగిరీలో ఉన్న 35 శాతం సీట్లలో 85 శాతం సీట్లు అంటే 952 సీట్లు ప్రత్యేకంగా తెలంగాణ విద్యార్థుల కోసం కేటాయిస్తా రు. మిగతా 15 శాతం (168 సీట్లు) మాత్రమే ఓపెన్ కోటా లో ఇతర రాష్ట్ర విద్యార్థులు పోటీ పడుతారు. ఓపెన్ కోటా కాబట్టి ఇందులో తెలంగాణ విద్యార్థులకు కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా మైనార్టీ కాలేజిలో 25 శాతం బీ కేటగిరీ కింద ఇప్పటి వరకు 137 సీట్లు ఉన్నాయి. తాజా సవరణతో ఇందులోనూ 85 శాతం అంటే 116 సీట్లు ఇక్కడి విద్యార్థులకే దక్కనున్నాయి.
ఇతర రాష్ట్రాల విధానంపై అధ్యయనం
రాష్ట్రంలో ఇప్పటివరకు మేనేజెమెంట్ కోటా సీట్లలో తెలంగాణ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఎలాంటి రిజర్వేషన్ లేదు. బీ కేటగిరీలో ఉన్న 35 శాతం కోటాలో ఎలాంటి లోకల్ రిజర్వేషన్లు అమలు చేయకపోవడం వల్ల ఇతర రా ష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఎక్కువగా ఇక్కడి కాలేజీల్లో ఎంబిబిఎస్ సీట్లు సొంతం చేసుకుంటున్నారు. తద్వారా తెలంగాణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ద చూపించిన ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, ఒడిషా, మధ్యప్రదేశ్, జమ్ము కాశ్మీర్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో ఓపెన్ కోటా విధానమే లేదు. గతేడాది నుండి అన్ని సీట్లు ఆయా రాష్ట్రాల విద్యార్థులకే దక్కేలా అక్కడి నిబంధనల్లో మార్పులు చేశారు. దీంతో తెలంగాణ విద్యార్థులు రిజర్వేషన్ లేక.. సొంత రాష్ట్రంలో అవకాశం లేక, ఇతర రాష్ట్రాల్లోని సీట్లు పొందలేక తీవ్రంగా నష్ట పోతున్నారు. దీన్ని గుర్తించి, అధ్యయనం చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడి విద్యార్థులకు లాభం చేకూరెలా తాజా నిర్ణయం తీసుకుంది. దీంతో 1,068 మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. ఎంబిబిఎస్ విద్య కోసం ఇతర రాష్ట్రాలు సహా, ఉక్రెయిన్, చైనా, రష్యా వంటి దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్వరాష్ట్రంలోనే డాక్టర్ చదివేందుకు అవకాశాలు కలుగనున్నాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ప్రారంభించి వైద్య విద్యను పటిష్టం చేస్తున్న క్రమంలో, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోనూ ఇక్కడి విద్యార్థులకే ఎక్కువ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా బి కేటగిరి సీట్లలో లోకల్ రిజర్వేషన్ 85 శాతానికి పెంచి, తెలంగాణ విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంది. దాంతో డాక్టర్ కావాలనే కలను స్వరాష్ట్రంలోనే ఉండి చదివి సాకారం చేసుకోవాలనుకునే ఎంతో మంది విద్యార్థులకు గొప్ప అవకాశం కల్పించింది.
ఉత్తర్వుల జారీ పట్ల హర్షం
రాష్ట్రలో ఎంబిబిఎస్ బీ కేటగిరీ సీట్ల భర్తీలో లోకల్ రిజర్వేషన్‌లు అమలు చేయాలని నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల తెలంగాణ ఎంబిబిఎస్ బీ కెటగిరి సీట్ల లోకల్ రిజర్వేషన్ సాధన సమితి హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు గురువారం సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు దాసరి రవిప్రసాద్, ముఖ్యసలహాదారు ఇ. చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి సతీష్‌లు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల తెలంగాణలోని ఎంతో మంది వైద్య విద్య ద్వారా డాక్టర్ కావాలనే కోరిక నెరవేరుతుందని చెప్పారు. 2017 నుంచి ఎంబిబిఎస్ బీ కేటగిరి సీట్లలో లోకల్ రిజర్వేషన్‌లు అమలు చేయాలని కోరుతూ తాము చేస్తున్న పోరాటం ఫలించిందన్నారు. ఎంతో కాలం నుంచి తెలంగాణ విద్యార్థులకు బీ కేటగిరీ సీట్లలో అన్యాయం జరుగుతుందని, ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించి జీవో జారీ చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. తమ విజ్ఞప్తులను మన్నించి జీవో జారీకి కృషి చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు.

TS Govt Decides to give 85% percent of MBBS Seats

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News