తాజా రుణమాఫీ
కింద ఇప్పటివరకు
63074 మంది
ఖాతాల్లో రూ.172
కోట్లు జమ
మనతెలంగాణ/హైదరాబాద్ : పంటల సాగు పెట్టుబడులకోసం బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకున్న రైతుల్లో 12280మందికి ప్రభుత్వం శనివారం నాడు రుణాలు మాఫీ చేసింది. రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.36.29కోట్లు జమ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 16నుంచి పంటరుణాల మాఫీకార్యక్రమాన్ని ప్రారంభించాక ఇప్పటివరకూ రాష్ట్రంలో 63,074మంది రైతుల ఖాతాలకు రూ.172కోట్ల జమ చేసింది. రుణమాఫీ కార్యక్రమం కొసాగుతోందని , అర్హతగల ప్రతిరైతును రుణవిముక్తుడిని చేయాలన్నదే ప్రభుత్వ లక్షం అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. కరోనా కష్టకాలంలోనూ రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీ తదితర పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అన్నారు. వ్యసాయ రంగం పట్ల , రైతుల పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్కు ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం అన్నారు. దేశంలోని మరేరాష్ట్రంలోనూ ఇన్ని రకాల వ్యవసాయ అనుకూల విధానాలు అమల్లో లేవన్నారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలతో వ్యవసాయం చేసే రైతన్నలకు ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. వ్యవసాయాన్ని లాభసాటి పరిశ్రమగా మార్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు.