యువతి వద్ద నుంచి రూ.25లక్షలు తీసుకున్న నిందితులు
హైదరాబాద్: ఉద్యోగం ఇప్పిస్తానని, మంచి పెళ్లి సంబంధం చూపిస్తానని చెప్పి రూ.25లక్షలు తీసుకుని మోసం చేసిన ఇద్దరు నిందితులను రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి మోటార్ సైకిల్, బంగారు ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… జిల్లేలగూడకు చెందిన నరేష్కుమార్ వీరబత్తిని, గిరి బాబు ఆకునూరి ఓ యువతితో ఛాటింగ్ చేసే వారు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడంతో యువతి దశల వారీగా రూ.25లక్షలు ఇచ్చింది. నరేష్ కుమార్ ఫిల్మ్ ఛాంబర్లో ఆఫీస్ బాయ్గా పనిచేస్తున్నాడు.
సీరియల్ యాక్టర్ మేకప్ వేసేవారితో మాట్లాడానని, ఫంక్షన్లలో మేకప్ వేసేందుకు అవకాశం ఇప్పిస్తానని చెప్పాడని బాధితురాలు తెలిపింది. కొద్ది రోజుల తర్వాత బాధితురాలు తన సోదరుడికి ఉద్యోగం పెట్టించాలని కోరింది. తనకు రైల్వే డిపార్ట్మెంట్లో చాలా పరిచయాలు ఉన్నాయని ఉద్యోగం పెట్టిస్తానని చెప్పాడు. నిందితుడికి మొబైల్ నంబర్లకు గూగుల్ పే, ఫోన్ పేకు డబ్బులు పంపించారు. నిందితులు డబ్బులు తీసుకుని కారును అద్దెకు తీసుకుని జల్సాలు చేశారు. బంగారు ఆభరణాలు, మోటార్ సైకిల్ తదితరాలను కొనుగోలు చేశారు. రాచకొండ సిపి మహేష్ భగవత్, సైబర్ క్రైం ఎసిపి హరినాథ్ పర్యవేక్షణలో ఇన్స్స్పెక్టర్ ఆశిష్ రెడ్డి, ఎస్సై ప్రవీణ్ కుమార్ కేసు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు