సూర్యాపేట : జిల్లాలోని చివ్వేంల మండలం బండమీది చందుపట్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డీసీఎం వ్యాను ఓ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మృతుల్లో సంవత్సరం బాబు ఉన్నాడు. మిగిలిన వారు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సూర్యపేట సర్కార్ దవాఖానకు తరలించారు. మెరుగైన చికిత్స కోసం వారిని హైద్రాబాదుకు తరలించారు.
వివరాల్లోకి వెళితే… సూర్యాపేట జిల్లా మోతె మండలం రాంపురం తండాకు చెందిన భూక్య బిక్షం ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో నివాసముంటున్నాడు. తండాలో ఉండే బిక్షం తండ్రి భూక్య బింగ్య (80) అనారోగ్యంతో బుధవారం మృతి చెందాడు. తండ్రి అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులతో నిన్న రాత్రి స్వగ్రామానికి బిక్షం బయలుదేరాడు.
రాష్ట్రంలో కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల వాహనాలు అందుబాటులో లేకపోవడంతో నలుగురు పట్టే కారులో బిక్షం,ఆయన ఇద్దరు భార్యలు,కొడుకుకోడలు, కూతురు అల్లుడు,వారి పిల్లలతో బయలుదేరారు. అర్ధరాత్రి సమయంలో చివ్వేంల మండలం వద్ద కారును డిసిఎం వ్యాను బలంగా ఢీకొట్టడంతో బిక్షం, మనవడు మృతి చెందారు. స్థానికులు సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.
Two persons died in road accident at suryapet