అమరావతి: విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో కెమికల్ గ్యాస్ లీకై భారీ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు వందల మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మృతుల్లో ఇద్దరు వృద్దులు, ఎనిమిదేళ్ల చిన్నారి ఉన్నట్టు సమాచారం. అర్థరాత్రి సమయంలో పాలిమర్స్ నుంచి పెద్ద మొత్తంలో విషవాయువు లీకైంది. దాదాపు మూడు కిలో మీటర్లు వరకు విస్తరించింది. దీన్ని పీల్చిన వారు తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. కళ్లు మంటలు, చర్మంపై దద్దుర్లు, కడుపులో నొప్పి, ఊపిరాడక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. అందులో కొందరు రోడ్లపైనే పడిపోయారు. సమాచారం అందుకున్న అధికారులు ఐదు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. తీవ్ర అస్వస్థతకు గురైన వందల మందిని అంబులెన్స్, పోలీసు వాహనాలల్లో ఆస్పత్రులకు తరలిస్తున్నారు. రాష్ట్రంలో లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో కంపెనీని తెరిచే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. కంపెనీ నుంచి స్టెరైన్ అనే విషవాయులు లీకైనట్టు సంబంధిత అధికారులు తెలిపారు.