కృష్ణా : తమతో వచ్చిన ఆడపిల్లలను రక్షించేందుకు వెళ్లిన ఇద్దరు యువకులు జలసమాధి అయ్యారు. ఈ సంఘటన నారాయణపేట జిల్లా కృష్ణా మండలం వాసునగర్ కర్నాటక సరిహద్దులోని కృష్ణానదిలో తోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎపిలోని పశ్చిమగోదావరి జిల్లా భీంవరం , పాలకొల్లుకు చెందిన రాంకృష్ణరాజు (27), శ్రీహరి (25)లు కొద్ది రోజుల క్రితం హైదరాబాద్లో జరిగిన ఒక వివాహా వేడుకకు హాజరయ్యారు. శనివారం రాత్రి కృష్ణా మండల పరిధిలోని వాసునగర్లో జరిగిన మరో బంధువుల వివాహానికి హాజరయ్యారు. ఆదివారం ఉదయం నది గ్రామానికి సమీపంలో ఉండటంతో సరదాగా స్నానం చేసేందుకు ముగ్గురు బాలికలతో కలిసి వీరు వెళ్లారు. బంధువులు స్నానం చేసి వెళ్లిపోయినప్పటికీ, ఈ ఐదుగురు మాత్రం నదిలో స్నానాలు చేస్తూ గడిపారు.
అందులో ఓ అమ్మాయి కాలు జారీ నదిలోకి జారీపడటంతో ఆమెను రక్షించేందుకు మరో నలుగురు నదిలోకి వెళ్లారు. పక్కనే ఉన్న జాలరు గోపాల్ , ముగ్గురు అమ్మాయిలను రక్షించగా ఇద్దరు యువకులు మాత్రం గల్లంతు అయ్యారు. ఎంత వెతికినప్పటికీ వీరి ఆచూకి లభించలేదు. అధికారులు కృష్ణా మండలం నుంచి గజ ఈతగాళ్లను రప్పించి నదిలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతి చెందిన వారిలో రాంకృష్ణరాజ్, శ్రీహరిరాజు ఉన్నారు. ఈ యువకుల మృతితో వారి కుటుంబాల్లో విషాదం అలుముకుంది. పోస్టుమార్టం నిమిత్తం రాంకృష్ణరాజు, శ్రీహరి మృతదేహాలను మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.