ఏకకాలంలో రెండు డిగ్రీలు
రెగ్యులర్గా ఒకటి, డిస్టెన్స్లో మరొకటి
త్వరలో అందుబాటులో రానున్న కొత్త విధానం
మనతెలంగాణ/హైదరాబాద్:దేశంలో విద్యార్థులు ఒకేసారి రెండు డిగ్రీ కోర్సులు చేసే పరిస్థితులు త్వరలో రానున్నాయి. అయితే రెండూ ఏకకాలంలో రెగ్యులర్ కోర్సులుగా ఉండేందుకు అనుమతి ఉండదు. సాధారణ కళాశాల తరగతులలో రెగ్యులర్గా ఒక కోర్సు, ఆన్లైన్లో దూరవిద్య ద్వారా మరొక కోర్సు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యుజిసి) అనుమతించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధానంలో అమలులోకి వస్తే దేశంలోని విద్యా సంస్థల్లో విద్యార్థులు రెండు డిగ్రీ కోర్సులు కలిపి ఒకే విద్యా సంవత్సరంలో పూర్తి చేయవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు పోటీని ఎదుర్కొనేందుకు అవసరమైన నైపుణ్యాలు అవసరమవుతున్నాయి.ఈ విధానంలో ప్రపంచస్థాయిలో జాబ్ మార్కెట్లో అవసరమైన నైపుణ్యాలు ఏకకాలంలో అభ్యసించే అవకాశం ఉంటుంది. ఒక డిగ్రీలో లేని నైపుణ్యాలను ఇతర డిగ్రీ ద్వారా అభ్యసించవచ్చు. ఏకకాలంలో రెండు డిగ్రీ కోర్సుల ప్రతిపాదనలు 2012లోనే యుజిసి ముందుకు రాగా, ఈ ప్రతిపాదనలపై హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం అప్పటి వైస్ చాన్స్లర్ నేతృత్వంలో కమిటీ ద్వారా అధ్యయనం చేయించింది.
రెగ్యులర్ విధానం కింద డిగ్రీలో చేరిన విద్యార్థి, అదే సమయంలో ఓపెన్ లేదా డిస్టెన్స్ విధానంలో గరిష్టంగా ఒక అదనపు డిగ్రీ చేయడానికి అనుమతించవచ్చని ఆ కమిటీ సిఫారసు చేసింది. రెగ్యులర్ మోడ్లో రెండు డిగ్రీలు ఒకేసారి అనుమతించడానికి పాలనా పరంగా వీలుకాదని తెలిపింది. ఈ విధానంలో అమలులోకి వస్తే విద్యార్థులు వారు చదువుతున్న కోర్సుల్లో లేని నైపుణ్యాలను మరో డిగ్రీలో చేరి అభ్యసించనున్నారు. దాంతో డిగ్రీ పూర్తయిన తర్వాత ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు నేర్చుకునేందుకు మరికొన్ని కోర్సులు చేయాల్సిన అవసరం లేకుండా ఏకకాలంలో రెండు డిగ్రీల ద్వారా వాటిని పొందనున్నారు. ప్రస్తుత పరిస్థితులకు రెండు డిగ్రీల విధానంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. విద్యార్థులు పోటీని ఎదుర్కొనాలంటే పరిజ్ఞానం మరింత అవసరమని భావించి ఒకేసారి రెండు డిగ్రీలకు అవకాశం కల్పించే దిశగా యుజిసి ఆలోచిస్తున్నట్లు తెలిసింది.
UGC may be allow to Pursue 2 Degrees at a time