ఖాట్మండ్ : నేపాల్ అధికార నేషనల్ కమ్యూనిస్టు పార్టీ (ఎన్సిపి) తనపై క్రమశిక్షణ చర్యకు నిర్ణయించడాన్ని నేపాల్ ప్రస్తుత ప్రధాని కె.పి.శర్మ ఓలి తిరస్కరించారు. తనపై కుట్రలు పన్నుతుండడంపై తాను బలవంతంగా పార్లమెంటును రద్దు చేయాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఆదివారం నాడు తన ప్రత్యర్థులకు విస్మయం కలిగేలా ఓలి పార్లమెంట్ను అధ్యక్షురాలిచే రద్దు చేయించ గలిగారు. అయితే ప్రధాని ఓలి తీసుకున్న ఈ చర్య రాజ్యాంగ విరుద్ధమని, అప్రజాస్వామికమని, తన వ్యక్తిగత ఇష్టంపై తీసుకున్న చర్యగా అధికార నేషనల్ కమ్యూనిస్టు పార్టీ స్థాయి సంఘం సమావేశం విమర్శించింది. ప్రధానిపై క్రమశిక్షణ చర్యకు సిఫార్సు చేసింది. అధ్యక్షురాలు విద్యాదేవి భండారిని అభిశంసించి తనకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం తీసుకురాడానికి కుట్ర జరుగుతోందని తెలిసి తాను పార్లమెంటును బలవంతంగా రద్దు చేయించ వలసి వచ్చిందని ప్రధాని ఓలి వివరించారు. తాము ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చామో అది నెరవేర్చలేక పోయామని అందుకని క్షమించాలని, తాజాగా ఎన్నికలకు సిద్ధం కావాలని ప్రజలను కోరతామని ఆయన అన్నారు.