Saturday, April 27, 2024

రైల్వే శాఖ మంత్రికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహబూబ్‌నగర్, షాద్‌నగర్ రైల్వే స్టేషన్లలో రైళ్ల స్టాప్‌నకు సంబంధించి రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటనలో భాగంగా రూ.1,410 కోట్లతో 85 కిలోమీటర్ల పొడవున సికింద్రాబాద్ టు మహబూబ్ నగర్‌ల మధ్య నిర్మించి, విద్యుద్దీకరించిన డబ్లింగ్ రైల్ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన విషయాన్ని కిషన్ రెడ్డి ఈ లేఖలో ప్రస్తావించారు.

ఈ నేపథ్యంలోనే యశ్వంత్‌పూర్ టు హజరత్ నిజాముద్దీన్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలును (రైలు నెం. 12649/12650) కాచిగూడ నుంచి బయలుదేరి కర్నూలు చేరుకునే వరకు 200 కిలోమీటర్ల మధ్యలో ఎక్కడా స్టాప్ లేని విషయాన్ని కిషన్‌రెడ్డి గుర్తుచేస్తూ మధ్యలో ఉన్న మహబూబ్‌నగర్ రైల్వేస్టేషన్‌లో ఈ రైలుకు స్టాప్ ఏర్పాటుచేయాలని ఆయన కోరారు. తద్వారా ఢిల్లీ, బెంగుళూరు వంటి సుదూర ప్రాంతాలకు ప్రయాణించే ఈ ప్రాంత ప్రజలు హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం ఉండదని లేఖలో కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
షాద్‌నగర్ రైల్వేస్టేషన్‌లో స్టాప్ ఏర్పాటు చేస్తే….
దీంతోపాటుగా చెంగల్‌పట్టు – కాచిగూడ ఎక్స్‌ప్రెస్ (రైలు నెం. 17651/17652)కు షాద్‌నగర్ రైల్వేస్టేషన్‌లో స్టాప్ ఏర్పాటు చేస్తే హైదరాబాద్ సబర్భన్ ప్రాంతాల్లోని ప్రజలు ముఖ్యంగా తిమ్మాపూర్, కొత్తూరు, బూర్గుల తదితర ప్రాంతాల ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందని ఈ లేఖలో కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని కిషన్‌రెడ్డి కోరారు. రాష్ట్రంలో రైల్వే శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ కార్య క్రమాలను ప్రస్తావిస్తూ ఇంతవరకు అందించిన, అందిస్తున్న అన్ని రకాల సహాయ, సహకారాలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News