మనతెలంగాణ/హైదరాబాద్: అధికవడ్డీలు, పెట్టుబడుల పేరిట ఆర్థికమోసాలకు పాల్పడిన కేసులో శిల్పా చౌదరి పోలీసు కస్టడీ ముగియడంతో బుధవారం నార్సింగి పోలీసులు గోల్కొండ ప్రభుత్వ ఆసుపత్రిలో శిల్పకు కరోనా పరీక్ష నిర్వహించిన అనంతరం రాజేంద్రనగర్ ఉప్పర్ పల్లి కోర్టులో హాజరుపర్చారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఆమెకు 14 రోజులు రిమాండ్ విధించడంతో చంచల్గూడా జైలుకు తరలించారు. ఆమె బెయిల్ పిటిషన్పై విచారణను వాయిదా వేసింది. కాగా పోలీసు కస్టడీలో కేసు విచారణలో భాగంగా కోకాపేట యాక్సిస్ బ్యాంకులో శిల్ప అకౌంట్కు సంబంధించి జరిగిన లావాదేవీలను పోలీసులు పరిశీలించారు. శిల్పను పోలీసులు ఇప్పటికే రెండు పర్యాయాలు కస్టడీలోకి తీసుకొన్న పోలీసులు పలు కోణాల్లో విచారించారు. ఇందులో భాగంగా పోలీసులు ఆమె బ్యాంకు లాకర్ను తనిఖీ చేశారు. కోకాపేట్లోని యాక్సిస్ బ్యాంకులో ఉన్న శిల్పా చౌదరి ఖాతాను బ్యాంకు అధికారుల సమక్షంలో పోలీసులు తనిఖీ చేశారు.
ప్రముఖుల నుంచి కోట్ల రూపాయలు తీసుకున్న శిల్పా వాటిని ఎక్కడికి మళ్లించిందనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. సంపన్నుల నుంచి వసూలు చేసిన డబ్బంతా ఎక్కడికి మళ్లించిందనే వివరాలను సేకరిస్తున్నారు. కాగా ఆమె లాకర్, బ్యాంకు ఖాతాలలో నగదు లభించకపోవడంతో శిల్ప పక్కా ప్రణాళిక ప్రకారం మోసం చేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకవేళ మోసం గురించి బయటపడినా పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించకూడదనే ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. దీంతో పోలీసులు శిల్పతో పాటు ఆమె భర్త శ్రీనివాస్ ప్రసాద్ కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది కాలంలో ఇద్దరూ కలిసి ఎక్కువగా ఎవరితో మాట్లాడారు వాళ్లకు వీళ్లకు సంబంధం అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. శిల్పా చౌదరితో వ్యాపార సంబంధాలు నెరిపిన వాళ్ల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
Upparpally Court sent Shilpa into 14 day Remand