ఖాఠ్మండ్ : నూతన రాజకీయ పటంపై చర్చించేందుకు నేపాల్ పార్లమెంట్ ఎగువ సభ అంగీకరించింది. భారత్లోని మూడు ప్రాంతాలను తమ మ్యాప్లో చూపుతూ నేపాల్ కొత్త రాజకీయ పటాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. కొత్త మ్యాప్కు ఆ దేశ దిగువ సభ శనివారం ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. మొత్తం 275మంది సభ్యులండే దిగువ సభకు 258 మంది హాజరు కాగా, వారంతా ఏకగ్రీవ ఆమోదం తెలిపారు. దాంతో, ఈ బిల్లును ఆ దేశ పార్లమెంట్ సెక్రటరీ రాజేంద్రఫూయల్ ఆదివారం ఎగువ సభ ముందుంచారు.
న్యాయశాఖ మంత్రి శివమాయ తుంబహంగ్ఫే చర్చకు ప్రతిపాదించగా ఎగువ సభ అంగీకారం తెలిపింది. బిల్లుపై చర్చ సందర్భంగా సభ్యులు సవరణలు ప్రతిపాదించేందుకు 72 గంటల సమయముంటుంది. ఎగువసభలో అధికార నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీకి మూడింట రెండొంతుల బలమున్నందున బిల్లు ఆమోదం పొందుతుందని చెబుతున్నారు. ఉభయ సభల ఆమోదం తర్వాత ఆ దేశ అధ్యక్షుడి వద్దకు వెళ్తుంది. అక్కడ ఆమోద ముద్ర పడిన తర్వాత అధికారిక పత్రాల్లో నూతన పటాన్ని పొందుపరుస్తారు. నేపాల్ చర్యను భారత్ తీవ్రంగా ఖండించింది. కృత్రిమంగా పటాల్ని మార్చినంత మాత్రాన వాస్తవ సరిహద్దులు మారిపోవంటూ స్పష్టం చేసింది.