Monday, May 6, 2024

భారత్‌లో స్వలింగ సంపర్కుల హక్కులకు మద్దతు ఇవ్వండి

- Advertisement -
- Advertisement -

భారత్‌లో స్వలింగ సంపర్కుల హక్కులకు మద్దతు ఇవ్వండి
ప్రధాని మోడీని కోరిన భారత అమెరికా ఎల్‌జిబిటిక్యు సభ్యులు
వాషింగ్టన్: భారత దేశంలోని స్వలింగ సంపర్కుల(ఎల్‌జిబిటిక్యు)సమాన హక్కులకు మద్దతు ఇవ్వాలని భారత అమెరికా ఎల్‌జిబిటిక్యు సభ్యులు శనివారం ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. అమెరికా అధ్యక్షడు జో బైడెన్ దంపతుల ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెలలో తొలి అధికారిక పర్యటన కోసం అమెరికా రానున్న విషయం తెలిసిందే.ఈ నెల 21న ప్రారంభమయ్యే ఆయన నాలుగు రోజుల పర్యటనలో 22న బైడెన్ దంపతులు మోడీకి అధికారిక విందు ఇవ్వనున్నారు.‘ భారత సర్వోన్నత న్యాయస్థానం గే మ్యారెజి అంశాన్ని చర్చిస్తోంది.

కొద్ది నెలల క్రితం ఓ జంట ఎల్‌జిబిటిక్యు వివాహం కూడా చేసుకుంది. దీనికి మద్దతు ఇవ్వాలని, భారత్‌లోని ఎల్‌జిబిటిక్యు వర్గం సమాన హక్కులను సమర్థించమని నేను ప్రధాని మోడీని కోరుతున్నాను. మన పిల్లలైన వారికి వారికి కూడా సమాన హక్కులు లభించాల్సి ఉందనే విషయాన్ని అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను’ అని దక్షిణాసియా ప్రాంతంలో ఎల్‌జిబిటిక్యు కుటుంబాల హక్కులు, సమస్యలకోసం పోరాటం చేసే స్వచ్ఛంద సంస్థ ‘దేశీ రెయిన్‌బో’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అరుణా రావు అన్నారు. అధ్యక్ష భవనం శ్వేతసౌధం లాన్స్‌లో జరిగిన చరిత్రాతక ప్రైడ్ ర్యాలీలో పాల్గొనడానికి ఆహ్వానం అందుకొన్న కొద్దిమంది భారతీయ అమెరికన్లలో అరుణా రావు ఒకరు. బైడెన్ దంపతులు కూడా ఈ ర్యాలీలో ప్రసంగించారు.

‘నాకు అర్థమయింది ఏమిటంటే పట్టణ ప్రాంతాల్లో ఎల్‌జిబిటిక్యు వారి పట్ల కొంత మద్దతు ఉంది. చట్టపరంగా కూడా ప్రభుత్వం స్వలింగ సంపర్కుల విషయంలో కొంత ముందుకు వెళ్లింది. అయితే చేయాల్సింది ఇంకా చాలా ఉంది. చిన్న పట్టణాలు, గ్రామాల్లో ఇలాంటి వారికి ఎలాంటి మద్దతూ లేదు. వారికి ఎలాంటి సమాన హక్కులూ లేవు’ అని , ఆమె అన్నారు. సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా అన్ని విధాలా భారత దేశంలో, దక్షిణాసియాలోని ఈ వర్గానికి బోలెడంత మద్దతు అవసరం ఉందని ఆమె అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, జో బైడెన్ మధ్య మంచి భేటీ జరగాలని వైట్‌హౌస్ ప్రైడ్ రాలీలో పాల్గొన్న మరో భారతీయ అమెరిన్ లెస్లీ కింగ్‌స్టన్ ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News