Tuesday, May 14, 2024

యుపి నాలుగోదశలో 57.45 శాతం పోలింగ్

- Advertisement -
- Advertisement -
Uttar Pradesh phase 4 polling
ఈవిఎంలలో 624 మంది అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తం

లక్నో : ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఘట్టంలో బిజెపి, సమాజ్‌వాది పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టు సాగుతున్న పోరులో బుధవారం నాలుగో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తొమ్మిది జిల్లాల పరిధి లోని 59 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు 57.45 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. మధ్నాహం 1 గంట నుంచి 3 గంటల వరకు 37.45 శాతం పోలింగ్ నమోదు కాగా, సాయంత్రం 5 గంటలయ్యేసరికి 57.45 శాతం పోలింగ్ నమోదైంది. పిల్భిత్, లఖ్‌ంపుర్ ఖేరి , సీతాపూర్, హర్డోయి, ఉన్నావ్, లఖ్‌నవూ, రాయ్‌బరేలీ, బాందా, ఫతేపూర్ జిల్లాల పరిధి లోని 59 నియోజక వర్గాల్లో 624 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, వారి భవితవ్యాన్ని ఓటర్లు ఈవిఎంలలో నిక్షిప్తం చేశారు.

ఈ స్థానాల్లో మొత్తం 2.3 కోట్ల మంది అర్హులైన ఓటర్లు ఉండగా, వీరిలో 1.14 కోట్ల మంది పురుషులు, 99.3 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ పోలింగ్ కోసం ఎన్నికల సంఘం 13,817 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది లఖ్‌నవూలో బీఎస్పీ అధినేత్రి మాయావతి, మంత్రి బ్రిజేశ్ పాఠక్, పలువురు సీనియర్ అధికారులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరికొన్ని చోట్ల ఉదయపు నడకకు వచ్చినవారు తమ పోలింగ్‌స్లిప్పులను వెంట తీసుకొచ్చి ఓటేశారు. 2017 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 59 స్థానాలకు గాను బిజెపికి 51 స్థానాల్లో విజయం లభించగా, సమాజ్‌వాది పార్టీ నాలుగు, బీఎస్పీ మూడు చోట్ల గెలుపొందాయి. బిజెపి మిత్రపక్షమైన అప్నాదళ్‌కు ఒకే చోట విజయం లభించింది. ఇక్కడ 2017 ఎన్నికల్లో 62.55 శాతం పోలింగ్ నమోదు కాగా, 2019 లోక్‌సభ ఎన్నికల్లో 60.3 శాతం పోలింగ్ నమోదైంది. యూపీలో మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News