మన తెలంగాణ/హైదరాబాద్ : రోడ్లు-, భవనాలు, గృహ నిర్మాణ శాఖల పనుల పురోగతిపై బుధవారం వేరువేరుగా ఎర్రమంజిల్లోని ఆర్ అండ్ బి కార్యాలయంలో ఆ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఆర్అండ్ బి, హౌసింగ్ శాఖలు నిర్మాణ రంగం కార్మికుల కోసం తీసుకుంటున్న జాగ్రత్తలపై ఈ సమీక్షా సమావేశంలో చర్చించారు.
కోవిడ్-19 నిర్మూలన కోసం ప్రభుత్వం గుర్తించిన కంటైన్మెంట్ క్లస్టర్లలో రూ. 30 లక్షల అంచనా విలువతో జిహెచ్ఎంసి పరిమితుల్లో సుమారు 3.5 కిలోమీటర్ల మేర బారికేడింగ్ ఆర్అండ్బి శాఖ ఏర్పాటు చేసింది. జిల్లాల్లో 25 కిలోమీటర్ల పొడవు గల బారికేడింగ్ రూ. 1.2 కోట్లు వ్యయంతో ఏర్పాటు చేసినట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు.
కేంద్ర ప్రభుత్వం జారీ చేసినా మార్గదర్శకాలకు లోబడి కోవిడ్-19 హాట్ స్పాట్ గా గుర్తించబడిన కంటైన్మెంట్ క్లస్టర్లు వదిలేసి, వలస కూలీలు వర్క్ ప్లేస్ లో క్యాంపులో ఉన్న చోట పనులు ప్రారంభించాలన్నారు. సిఎం కెసిఆర్ ఆదేశించినట్లుగా కార్మికులకు కూడా ఎప్పటికప్పుడు కరోనాపై అవగాహన కల్పిస్తూ వారికి మాస్కులు,సానిటైజర్లు, భోజన వసతి ఏర్పాటు చేయాలని సూచించారు. కూలీలు సమూహంగా పనిచేయకుండా దూరం పాటించేలా పలు జాగ్రత్తలు తీసుకొని వారికి పనులు అప్పగించాలని అధికారులను ఆదేశించారు.
ప్రతి జిల్లాలో క్వాలిటీ కంట్రోల్ టీమ్ ఆఫీసర్లతో ఒక ఎన్ఫోర్స్మెంట్ టీమ్ ఏర్పాటు చేసి వారు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కార్మికులు కోవిడ్-19 మార్గదర్శకాలను పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఇప్పటికే ఆర్ అండ్ బి కాంట్రాక్టర్లకు పూర్తి బకాయిలు చెల్లించామని, ఆన్ గోయింగ్ పనుల్లో వేగం పెంచే విధంగా అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేయాలన్నారు. ఈనెల 18 న యాదాద్రి అభివృద్ధి పనులు,హైదరాబాద్ సిటీలో జరుగుతున్న వర్క్ విజిట్ చేయాలని అధికారుల సూచనల మేరకు నిర్ణయించారు.
ఈ సమీక్షా సమావేశంలో ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్ శర్మ, హౌసింగ్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ చిత్రా రామచంద్రన్,ఆర్ అండ్ బి ఇఎన్సిలు గణపతి రెడ్డి, రవీందర్ రావు, సిఇలు చందూలాల్, ఆషారాని, మొహన్ నాయక్, హౌసింగ్ చీఫ్ ఇంజనీర్ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.