కరోనా సంక్షోభంలో సంస్కరణలా?
రాష్ట్రాలకు ఆర్థిక సాయం మాటే లేదు
నిర్మలాసీతారామన్ ప్రకటనలు ప్రచార జిమ్మిక్కులే, ప్రజలను మోసం చేయడమే : రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్కుమార్
మన తెలంగాణ/హైదరాబాద్ : సంస్కరణ చర్యలను ఉపశమన చర్యలుగా భావిస్తున్నారని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మెన్ బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీ తారామన్ శనివారం ప్రకటించిన ఆర్థిక ప్యాకెజీ వివరాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. లాక్డౌన్తో పూర్తిగా ఆదాయం కో ల్పోయిన రాష్ట్రాలకు కేంద్రం ఎటువంటి ఆర్థి క సహాయం ప్రకటించకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటి వరకు చేసిన ప్రకటనలన్నీ ప్రచార జిమ్మిక్కులేనని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రజలను మోసం చేసే ప్రకటనలు మానుకోవాలని, నెరవేరని ఆశలు కల్పించడాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏ రంగంలోనైనా నిర్మాణత్మాక సంస్కరణలు అవసరమని, అయితే వీటిని అమలు చేయడానికి క్షేత్రస్థాయిలో కొన్ని సంవత్సరాలు పడుతుందన్నారు. తక్షణ ఫలితాలు, ప్రయోజనాలకు అవకాశం లేదన్నారు. అటామిక్ ఎనర్జీ, అంతరిక్ష, రక్షణ రంగాలలో ఈ సంస్కరణలు సంస్థాగతంగా కొవిడ్ 19 సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటున్నాయనేది ముఖ్యమన్నారు. కేంద్రపాలిత ప్రాంతాలలో డిస్కమ్ల ప్రైవేటీకరణ ప్రస్తుత సంక్షోభానికి ఏమైనా సంబంధం ఉందా అని ప్రశ్నించారు.