Monday, April 29, 2024

వసంత మండపంలో ఆగమోక్తంగా విష్ణు సాలగ్రామ పూజ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: లోకక్షేమాన్ని కాంక్షిస్తూ పవిత్రమైన కార్తీక మాసంలో టిటిడి తలపెట్టిన కార్యక్రమాల్లో మొదటగా విష్ణు సాలగ్రామ పూజ గురువారం తిరుమల వసంత మండపంలో ఆగమోక్తంగా జరిగింది. మధ్యాహ్నం 3 నుండి 4.30 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని వసంత మండపానికి వేంచేపు చేశారు. ముందుగా ప్రార్థనా సూక్తం, అష్టదిక్పాలక ప్రార్థన, నవగ్రహ ప్రార్థనతో విష్ణుసాలగ్రామ పూజను ప్రారంభించారు.

అనంతరం వేదపండితులు వేదమంత్రాలు పఠిస్తుండగా అర్చకులు సాలగ్రామాలకు పాలు, పెరుగు, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, సాలగ్రామాలకు హారతులు సమర్పించారు. నైవేద్యం సమర్పించిన అనంతరం క్షమా మంత్రం, మంగళంతో ఈ పూజ ముగిసింది.ఈ సందర్భంగా పురాణ పండితులు రామకృష్ణ శేషసాయి మాట్లాడుతూ సాలగ్రామాలు సాక్షాత్తు విష్ణువు అవతారమని, సాలగ్రామ పూజ వల్ల సర్వజన రక్షణ, సమస్త బాధల ఉపశమనం కలుగుతాయని తెలిపారు. సాలగ్రామాలకు చేసిన అభిషేక తీర్థాన్ని సేవిస్తే సమస్త పాపాలు తొలగి, సర్వవ్యాధులు నివారించబడతాయన్నారు.ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో ఎవి. ధర్మారెడ్డి దంపతులు, ధర్మగిరి వేద పాఠశాల వేదపండితులు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News