Saturday, April 27, 2024

అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తాం: అమిత్ షా

- Advertisement -
- Advertisement -

అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తాం
 ఆ రిజర్వేషన్లు ఎస్‌సి,ఎస్‌టి, బిసిలకు కేటాయిస్తాం
 తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అధికారికంగా నిర్వహిస్తాం
 కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
చేవెళ్ల: తెలంగాణలో అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేసి.. ఆ రిజర్వేషన్లు ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు కేటాయిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. బిజెపి పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా ఆదివారం చేవెళ్లలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో అమిత్ షా ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో బిజెపి ప్రభుత్వం మళ్ళీ వచ్చే ముందు.. తెలంగాణలో ట్రైలర్ చూపిస్తాం. తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామని వెల్లడించారు. ప్రధాని సీటు ఖాళీగా లేదని, వచ్చే ఎన్నికల తర్వాత కూడా మోడీనే ప్రధాని అని ఆయన పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ పేరుతో దేశమంతా విస్తరించాలనుకుంటున్నారని, అందులో భాగంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.

కారు స్టీరింగ్ మజ్లిస్ చేతుల్లో ఉందని, మజ్లిస్‌కు బిజెపి భయపడేది లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో కలిసేందుకు బిఆర్‌ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. టిఎస్పీఎస్సీ పరీక్ష పేపర్లు లీకవుతున్నాయి. యువకుల జీవితాలతో ఆటలాడుతున్నారు. లీకేజీలతో నిరుద్యోగుల జీవితాలను అంధకారంలోకి నెట్టారు. పేపర్ లీకేజీపై ప్రశ్నించిన బండి సంజయ్‌ని జైల్లో పెట్టారు. 24 గంటల్లో సంజయ్‌కు బెయిల్ వచ్చింది. ఈటల రాజేందర్‌ను అసెంబ్లీకి వెళ్లకుండా చేయాలనుకున్నారు. కానీ, వారికి సాధ్యం కాలేదన్నారు. పేపర్ లీకేజీపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి రాగానే హైదరాబాద్ పరేడ్ మైదానంలో తెలంగాణ స్వాతంత్ర దినోత్సవం నిర్వహిస్తామని వెల్లడించారు. రోడ్లు వేయడానికి డబ్బులు కేంద్రం ఇస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణను డబ్బులు ఇవ్వడం లేదన్నారు. బొల్లారం ఉందానగర్ మద్య ఎంఎంటిసి రెండో లైన్ పనులు మొదలయ్యాయి.

మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేయబోతున్నామని అమిత్ షా వెల్లడించారు. అంతకుముందు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ… బిజెపికి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బిజెపికి అవకాశమిస్తే రైతులను ఆదుకుంటాం. ఉచిత విద్య, వైద్యం అందిస్తాం. ఉద్యోగులకు ఒకటో తేదీకే జీతాలు ఇస్తాం. తెలంగాణ ప్రజలకు అన్ని విధాలుగా బిజెపి అండగా ఉంటుందన్నారు. హిందీ టెన్త్ పేపర్ లీకేజీ కేసులో నన్ను పోలీసులు అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేశారు. 8 గంటలు రోడ్ల మీదే తిప్పారని ఆయన గుర్తుచేశారు.

సభలో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ, పార్టీ వ్యవహారాల బాధ్యులు తరుణ్ చుగ్, మురళీధర్‌రావు, అరవింద్ మీనన్, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ ఎవిఎన్ రెడ్డి మాజీ మంత్రి చంద్రశేఖర్, ప్రేమేందర్‌రెడ్డి, బొక్క నర్సింహారెడ్డి, వీరేందర్‌గౌడ్, కాసం వెంకటేశ్వర్లు, బాబుమోహన్, జిల్లాల అధ్యక్షులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News