Saturday, April 27, 2024

ఎవరు దేశభక్తులు, ఎవరు ద్రోహులు?

- Advertisement -
- Advertisement -

ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో వున్న ప్రభుత్వం ‘వికాస్’ అనే మాట తరచూ మాట్లాడుతూ వుంది. అది అణగారిన వర్గాల రక్త మాంసాల్ని, మైనారిటీల అస్థి పంజరాల్ని కార్పొరేట్ శక్తులకు నైవేద్యం పెడుతూ దేశాన్ని ప్రగతి మార్గంలో నడిపిస్తోంది? దేశంలోని ప్రతి సగటు మనిషి గుండె మీద చేయి వేసుకొని తమకు తిండి, బట్టా దొరుకుతున్నాయా? అని తమ పిల్లలకు సరైన చదువు చెప్పించగలుగుతున్నాయా? అని ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ దేశ ప్రజలకు ఆరోగ్య సదుపాయం, రవాణా సౌకర్యాలు సరిగా అందుతున్నాయా? యువతకు ఉపాధి లభిస్తోందా? రైతులు సంతోషంగా వ్యవసాయం చేయగలుగుతున్నారా? అని ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది. దేశ ప్రజల్ని మతాల ప్రాతిపదికన, కులాల ప్రాతిపదికన, ఆర్థిక స్తోమత ప్రాతిపదికన విభజించి పాలిస్తూ ‘దేశ్ కా వికాస్’ ఎలా తేగలుగుతున్నారో ప్రత్యక్షంగా చూస్తూనే వున్నాం. బ్రిటీష్ వాడు విభజించి పాలించాడంటే అర్థం చేసుకోవచ్చు. వాడు విదేశీయుడు. ఇప్పుడు మరి వీరికేమయ్యింది? అందరం ఈ దేశ వాసులమే కదా?

మరి, ఈ దేశ ప్రజలకు ఏమైందీ? స్వాతంత్య్రానంతరం దేశంలో విద్యావంతుల సంఖ్య గణనీయంగా పెరిగింది కదా? వారు చదివిన చదువులు ఎందుకు వారిలో వివేకం పెంచలేకపోతున్నాయీ? కుటుంబ బాధ్యతలే నిర్వహించుకోలేని సన్యాసుల చేతికి అధికార పగ్గాలు ఎలా ఇస్తున్నారు? ఎందుకు ఇస్తున్నారూ? కమాన్, మమ్మల్ని దోచుకోండి! కమాన్, మమ్మల్ని అణగదొక్కండి; కమాన్ మా బతుకుల్ని దుర్భరం చేయండి అని అసమర్థులకు ఎందుకు లైసెన్స్ ఇస్తున్నారూ? ప్రభుత్వాధినేతలు చెప్పే అబద్ధాల ‘భాషణ్’లలో మిత్రోఁ.. ఏమిటీ? అంత తీపిదనం వుందా? మీ తెలివి తేటల్ని, శక్తిని వాళ్ళు ఆవు మూత్రంతో శుద్ధి చేస్తుంటే అంత మజా వస్తోందా? తినిపించే ఆవు పేడ అంత రుచిగా వుందా? ఏమిటీ కారణం? ఎందుకు దేశ పరిస్థితి పడిపోయిన రూపాయి విలువ లాగా హంగర్ ఇండెక్స్‌లో చివరికి చేరిన స్థానం లాగా ఈ దేశ ప్రజల విజ్ఞత ఎందుకు పడిపోతూ వుంది? జ్ఞానేంద్రియాలన్నింటినీ మూసి పెట్టుకొని ఎందుకు ఈ దేశ ప్రజలు అజ్ఞానానికి, మూర్ఖత్వానికి పట్టం కడుతున్నారు? ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది.

దేశభక్తుడు షహీద్ భగత్ సింగ్ ఎందుకు గుర్తుకు రావడం లేదూ? ఈ దేశాన్ని రక్షించుకోవడానికి రక్తం చిందించిన అమర వీరులైన దేశభక్తులెవరూ ఎందుకు గుర్తుకు రావడం లేదూ? ఎందుకు దేశ ద్రోహులను, మోసగాళ్ళను గద్దె నెక్కిస్తున్నారూ? మనం ఒక హిందూ, ఒక ముస్లిం, ఒక క్రైస్తవుడిగా పుట్టడమన్నది యాదృచ్ఛికం. ఎవరు, ఎక్కడ, ఏ ప్రాంతంలో పుట్టాలన్నది ఎవరి ఆధీనంలోనూ వుండదు కదా? ఏది ఏమైనా, అందరం ఈ దేశ వాసులం. భారతీయులం. అంతకన్నా ముఖ్యం అందరం మనుషులం! తేడా లెందుకూ? విభజన లెందుకూ? కుట్ర పూరితంగా విభజనలు ప్రోత్సహించే వారి ఆట కట్టించాలి కదా? అబద్ధాలు చెపుతూ పుకార్లు ప్రచారం చేసే వారి భరతం పట్టాలి కదా? కరోనా కష్టకాలంలో లక్షల మంది వలస కార్మికులకు కనీసం రైలు, బస్సు సౌకర్యం కల్పించలేని ప్రభుత్వ అసమర్థత ఎందుకు కనిపించడం లేదూ? లక్షల కోట్లు బ్యాంకు దోపిళ్ళు చేసిన వారిని మాత్రం భద్రంగా దేశం దాటిస్తారా? అదేనా ఈ దేశ చౌకీదారు చేయాల్సిన పని? అధిక సంఖ్యాకులైన సామాన్యుల జీవితాల్లో వెలుగులు నింపలేని ‘ప్రజా సేవకులు’ మనకు అవసరమా?

ఈ దేశంలోని యువతరాన్ని సంబోధిస్తూ దేశభక్తుడు షహీద్ భగత్ సింగ్ చెప్పిన మాటలు ఇలా వున్నాయి.
“భారత రిపబ్లిక్‌లోని యువతీ యువకులారా! సిపాయిలారా? విశ్రాంతిగా, నిరర్ధకంగా నిలబడకండి. అడుగులో అడుగు వేస్తూ కార్యోన్ముఖులుకండి. తీవ్రమైన ఆకలి, పేదరికం మీకు సవాలు విసురుతోంది! దాన్ని తిప్పి కొట్టాల్సి వుంది. మీరొక మంచి మిషన్ (ధ్యేయం)లో నిమగ్నమై వున్నారు. దేశం అన్ని వైపులా, అన్ని మూలల్లో విప్లవ జ్వాలలు అంటుకుంటున్నాయి. ప్రజల్ని సమాయత్తం చేయండి. మీ ధ్యేయం వినిపిస్తున్న బిగుల్ ధ్వని (యుద్ధభేరి) వినండి. విని కదలండి. ఇలాగే నిశ్చేష్ఠులై నిస్సారంగా జీవితం గడపకండి” భగత్ సింగ్ ఆయన కాలంలో చెప్పిన మాటలు ఈ కాలానికి కూడా పనికొస్తాయి. అందువల్ల ఆయన కన్న కలల్ని నిజం చేయాల్సిన బాధ్యత ఈ తరం యువతీ యువకుల మీద వుంది. వారంతా తీవ్రంగా ఆలోచించాలి. లేవాలి. లేచి, కార్యాచారణకు పూనుకోవాలి. లేకపోతే ఇంకా ఇంకా నష్టం జరిగిపోతుంది. ఆ తర్వాత పశ్చాత్తాపంలో కుమిలిపోయినా లాభం వుండదు.

హిట్లర్ పరిపాలనా కాలంలో ఫాసిజాన్ని వ్యతిరేకించే ఒక కార్యకర్త, కవి పాస్టర్ నిమోలర్ ఒక కవిత రాశాడు. అది తెలుగులోకి తెస్తే ఇలా వుంటుంది. మొదట వాళ్ళు కమ్యూనిస్టుల కోసం వచ్చారు.అప్పుడు నేనేం మాట్లాడలేదు కారణం. నేను కమ్యూనిస్టుని కాదు కాబట్టి! తర్వాత వాళ్ళు ట్రేడ్ యూనియన్ వారి కోసం వచ్చారు. అయినా నేనేం మాట్లాడలేదు
కారణం. నేను ట్రేడ్ యూనియన్‌లో లేను కాబట్టి! ఆ తర్వాత వాళ్ళు యూదుల కోసం వచ్చారు.అప్పుడూ నేనేం మాట్లాడలేదు కారణం, నేను యూదుణ్ణి కాదు కాబట్టి! వాళ్ళు మళ్ళీ నా కోసం వచ్చారు అంతే అప్పటికి, నా గురించి మాట్లాడే వాళ్ళే మిగల్లేదు. జరుగుతున్న అన్యాయాల సెగ మనకు తగలడం లేదు కదా అని తమాషా చూస్తూ వుంటే, ఆ తర్వాత మన గురించి గొంతెత్తే వారే వుండరు. సంఘ్ పరివార్, బిజెపిలు కలిసి ఆ హిట్లర్ పథకాన్ని ఇక్కడ ఈ దేశంలో అమలు చేయాలని అనుకొంటున్నప్పుడు దేశ ప్రజలు ఏం చేయాలి? అన్యాయాల మీద, అబద్ధాల మీద, అరాచకాల మీద, అజ్ఞానం మీద, మూర్ఖత్వం మీద, పుకార్ల మీద,

కుట్రల మీద మనుషుల విభజన మీద తీవ్రంగా విరుచుకు పడాలికదా? ఓర్చుకొని, నోరు మూసుకుంటే అది మరింత వినాశనానికే దారి తీస్తుంది. మానవ జాతి అంతా ఒక్కటే అయినప్పుడు, ఈదేశ వాసుల్లోనే కొందరు మన వారు, కొందరు పరాయి వారు ఎలా అవుతారు? మన అన్నాతమ్ముళ్ళు, అక్కాచెల్లెళ్ళు ఉత్త పుణ్యానికి చనిపోతూ వుంటే, విభజించి పాలిస్తున్న ఈ పాలకులు గొప్ప పాలన అందిస్తున్నారని మనమిక్కడ వేడుకలు చేసుకుందామా? దేశభక్తులు షహీద్ భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురూలు 20 మార్చి 1931న పంజాబ్ గవర్నర్‌కు ఒక లేఖ పంపించారు. అందులోని సారాంశం ఇలా వుంది. “ మేం చెప్పదల్చుకున్నదేమంటే, ఇక్కడ యుద్ధం ప్రారంభం కానే అయ్యింది. శ్రామికుల శ్రమ శక్తిని అన్యాయంగా దోచుకొని బలిసిపోతున్న కార్పొరేట్లకు వ్యతిరేకంగా ఈ యుద్ధం కొనసాగుతుంది. దోచుకునే కార్పొరేట్లు బ్రిటీష్ వారైనా, స్వదేశీయులైనా మాకు ఒక్కటే వాళ్ళంతా ఒక్కటై సామాన్యుల నడ్డి విరుస్తున్నారు. జీవితాలు దుర్భరం చేస్తున్నారు. అందుకే చెపుతున్నాం. దోపిడీని, అణచివేతను ఇక ఎంత మాత్రమూ సహించం. రక్తం తాగేవాడు స్వదేశీయుడైతే నేమిటీ? విదేశీయుడైతేనేమిటి? మాకు అందరూ శత్రువులే!”

ఆనాడు ఆ దేశభక్తులు వెలిబుచ్చిన ఆవేదనను ఇప్పుడు ఈ దేశ ప్రజలందరూ మళ్ళీ వెలిబుచ్చాల్సిన అవసరం వచ్చింది. కారణం ఇప్పుడు సమకాలీనంలో కూడా ఇదే పరిస్థితి వుంది. “ఒకప్పుడు జర్మనీలో జరిగినట్టుగానే ఇక్కడ భారత దేశంలో బిజెపి ప్రభుత్వం అసలు సమస్యల నుండి దృష్టి మరల్చడానికి మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ వుంది” అని అన్నారు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షులైన జస్టిస్ మార్కండేయ కట్జూ.
అసలు సమస్యల నుండి దృష్టి మరల్చడానికి మన దేశ నాయకులు ప్రచారం చేస్తున్న అంశాలు: 1. పురాణాల్లో సైన్స్ వుంది. 2. మసీదులో లింగం వుంది. 3. హిందీ భాషని దేశంలో తప్పనిసరి చేయాలి. 4. ముస్లింలను దేశం నుండి తరిమేయాలి. 5. ఘర్ వాపసీ ఇతర మతాలలో వున్న వాళ్ళందరూ ఒకప్పుడు హిందువులే గనుక వారందరూ మళ్ళీ ఇంటికి తిరిగి రావాలి. అంటే హిందువులుగా మారాలి. 6. ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీలకు ఈ దేశంలో ఎలాంటి హక్కులు వుండకూడదు. 7. మొఘల్ చక్రవర్తులు దుర్మార్గులు వారి కట్టడాలు, ఆనవాళ్ళు ఈ దేశంలో వుండకూడదు.

8. స్త్రీల వస్త్రధారణా విధానాల వల్లనే రేప్‌లు జరుగుతున్నాయి. 9. ఆవు మూత్రం, ఆవు పేడలతో అన్ని రోగాలు నయం చేసుకోవచ్చు. 10. ఓం శబ్దంలోని మహత్తును నాసా కూడా గుర్తించింది ఇలా ఇష్టం వచ్చిన విషయం మీద ఇష్టం వచ్చిన విధంగా మాట్లాడుతూ దేశ ప్రజల్ని అయోమయంలో పడేయాలని వారు అనుకున్నారు. అలా కాలక్షేపం చేస్తూ, అధికారంలో కొనసాగవచ్చు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచుకోవచ్చునన్నది వారి ఆలోచన!
ఐన్‌స్టీన్ లాంటి మహాశాస్త్రవేత్త, గోథే లాంటి మహా రచయిత, బెథోవెన్ వంటి మహా సంగీతకారుడు, కాంట్, నీషే, మార్క్ లాంటి గొప్ప తత్వవేత్తలు అందరూ జర్మన్లే. కాని 1933 జర్మనీ హిట్లర్ ఆధీనంలోకి రాగానే పరిస్థితుల్ని పూర్తిగా మార్చేశాడు. సమస్యలన్నింటికీ యూదులే కారణమని ప్రచారం చేశాడు. ఆలోచనా పరుల మెదళ్ళలో కూడా విషం నింపాడు. ఫలితం ఏమైంది? సుమారు 60 లక్షల మంది యూదులను గ్యాస్ ఛాంబర్‌లోకి పంపి హత్య చేయించాడు. చరిత్ర పుటల్లో కనీవినీ ఎరుగని దుర్మార్గం అక్కడ జరిగిపోయింది.

పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే ఫాసిజం ఇక్కడ ఈ దేశంలో విలయతాండవం చేస్తోంది. తమకు తాము దేశ భక్తులమని ప్రకటించుకొన్న వారు, దేశ స్వాతంత్య్రానికి ముందు గాని, తర్వాత గాని వారు చేసే దంతా దేశద్రోహమే…నన్నది తేలిపోయిన తర్వాత, రగిలిపోతున్న ఈ దేశ ప్రజలు ఆచరణలోకి దిగకుండా వుంటారా? సామాన్యుల సంఘటిత శక్తిని తక్కువగా అంచనా వేసే ఈ పాలకులే భవిష్యత్తులో అవహేళనకు గురి కాబోతున్నారు. నియంతలకు చరిత్ర ఏ గతి పట్టిస్తూ వచ్చిందో మనందరికీ బాగా తెలుసు!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News