జెనీవా: కరోనా వైరస్పై కొన్ని దేశాల నేతల మాటలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేత టెడ్రోస్ అధ్నోమ్ గెబ్రోయెసెస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు తలోదిక్కుగా దీనిపై స్పందిస్తున్నారని వ్యాఖ్యానించారు. పలు దేశాలు కరోనా వైరస్ విషయంలో తప్పుడు దిశలో వెళ్లుతున్నాయని పేర్కొన్నారు. అయితే ఏఏ దేశాల ప్రభుత్వాధినేతల తీరు సరిగ్గా లేదనేది ఆయన పేర్కొనలేదు. వారు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటమే కాకుండా, వైరస్ వ్యాప్తిని అరికట్టే దిశలో సరిగ్గా వ్యవహరించడం లేదని విమర్శించారు. అయితే తీవ్రస్థాయి మహమ్మారిని అరికట్టడంలో దేశాలకు ఉన్న సమస్యలు తనకు తెలుసునని, ఈ కోణంలో వివిధ ప్రభుత్వాధినేతల స్పందనను తాను అర్థం చేసుకోగలనని తెలిపారు. వైరస్ కట్టడికి తప్పనిసరిగా ఆంక్షలు అవసరమే. అయితే దీనితో తలెత్తే ఆర్థిక, సామాజిక సాంస్కృతిక పరిణామాలు కూడా ఉంటాయని, ఈ నేపథ్యంలో వివిధ దేశాల నేతలు స్పందించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. వైరస్ ఇప్పుడు ప్రజల పాలిటి శత్రువు అయిందని సంస్థ డైరెక్టర్ జనరల్ అంగీకరించారు. అయితే శత్రువుతో పోరాడాల్సిన రీతిలో ప్రజలు , ప్రభుత్వాలు వ్యవహరించడం లేదన్నారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఉధృతి పెరుగుతోందని, ఒక్కరోజే 230000కు పైగా కేసులు కొత్తగా నమోదయ్యాయని, ఈ తరుణంలో వివిధ దేశాల ప్రభుత్వాలు అక్కడి స్థానిక పరిస్థితులను ప్రాతిపదికగా చేసుకుని వ్యవహరించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రజలు కూడా ఈ దిశలో తగు విధంగా స్పందించాల్సి ఉంటుందన్నారు. కొన్ని దేశాలలో కరోనా తీవ్రస్థాయిలో ఉందని, కరోనా కేసులు తగ్గిన చోట వెంటనే పాఠశాలలు ప్రారంభిస్తున్నారని, ఇక నేతలు ఇదే సమయంలో తమ రాజకీయ ఆటకు దిగుతున్నారని, అంతా సవ్యంగా ఉందని తెలియచేసుకునేందుకు సరైన ఆంక్షలకు దిగకుండానే రీ ఓపెన్ ప్రక్రియకు వెళ్లుతున్నారని ఆరోగ్య సంస్థ అధినేత తెలిపారు. వైరస్తో పోరు ముగిసిందని అనుకోరాదని, ప్రజలను దీర్ఘకాలం పాటు వైరస్ నివారణ చర్యలకు సమాయత్తం చేయాల్సి ఉందన్నారు.
WHO Chief slams mixed messages from leaders on virus