అదనపు కట్నం కోసం వేధింపులు.. ఇచ్చిన తల్లిదండ్రులు
ఉన్నతోద్యోగం కోసం అమెరికా వెళ్లిన భర్త
ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు
2018లో వచ్చి తిరిగి వెళ్లిన వీరేష్
భార్యా, కూతురికి ఫోన్ చేయని భర్త
భర్త ఇంటి ఎదుట ధర్నా చేస్తున్న బాధితురాలు
మనతెలంగాణ, బోడుప్పల్ : వివాహం చేసుకుని అమెరికా వెళ్లిన భర్త తనను, తనకూతురిని పట్టించుకోవడంలేదని ఓ మహిళ కుటుంబ సభ్యులతో కలిసి భర్త ఇంటి ఎదుట ధర్నా చేస్తున్న సంఘటన నగరంలోని బోడుప్పల్లో సోమవారం చోటుచేసుకుంది. సూర్యపేట జిల్లా, నూతనకల్లు మండలం, ఎల్కపల్లి గ్రామానికి చెందిన వీరస్వామి, పద్మ కూతురు అలివేలును బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని సూర్యహిల్స్లో ఉంటున్న సాయిలు, ఉపేంద్ర పెద్ద కుమారుడు వీరేశంకి ఇచ్చి 2010, నవంబర్14వ తేదీన వివాహం చేశారు. వివాహం సందర్భంగా రూ.8లక్షల నగదు, ఎనిమిది తులాల బంగారు ఆభరణాలు పెట్టారు. నగరంలోని సోమాజిగూడలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న వీరేష్ కొద్ది రోజుల తర్వాత భార్యను అదనపు కట్నం కోసం వేధించాడు. దీంతో తమ కూతురు ఇబ్బందులు పడకూడదని వీరేష్ అడిన అదనపు కట్నం ఇచ్చారు.
వీరి దంపత్య జీవితానికి గుర్తుగా వీరేష్, అలివేలుకు పాప జన్మించింది. ఈ క్రమంలోనే ఉన్నతోద్యోగానికి 2016లో అమెరికా వెళ్లిన వీరేష్ రెండు సంవత్సరాల వరకు భార్య, కూతురికి ఏనాడు ఫోన్ చేసి భాగోగులు అడగలేదు. అయినా కూడా అలివేలు కూతురితో కలిసి అత్తవారింట్లోనే ఉంటూ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసింది. భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తన భర్త ఆచూకీ కోసం అలివేలు నూతనకల్లు పిఎస్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేయడంతో వీరేష్ పోలీసులకు నోటీసు ఇచ్చారు. నిందితుడిలో ఎలాంటి మార్పు రాలేదు. 2018, ఫిబ్రవరి వీరేష్ ఇండియాకు తిరిగి వచ్చి రెండు నెలల్లో తిరిగి వెళ్లాడు. ఇప్పటి వరకు మళ్లీ ఎలాంటి ఆచూకీ లేకపోవడంతో తనకు తన కూతురుకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాధితురాలు ధర్నాకు దిగింది. బాధితురాలికి స్థానిక కార్పొరేటర్ దొంతరబోయిన మహేశ్వరికృపాసాగర్, ధర్మవతి, వాకులాకుమారి, సుధా, అంజలీ, నిర్మల, మంగమ్మ,లక్ష్మి మంజుల, విజయ,హరిక, శిల్ప, మీనా,టీఆర్ఎస్ పార్టీ నాయకులు రాములు, కృపసాగర్, పోకల రవి ముదిరాజ్, కరుణాకర్ రెడ్డి,భూమయ్య, జగన్ పాల్గొన్నారు.