Tuesday, April 30, 2024

మార్పులతో మళ్లొస్తా

- Advertisement -
- Advertisement -

Withdrawal of three capital bills in the AP

ఎపిలో మూడు రాజధానుల బిల్లుల ఉపసంహరణ

సమగ్రమైన బిల్లుతో మళ్లీ సభ ముందుకు:
ముఖ్యమంత్రి జగన్ సంచలన ప్రకటన

త్వరలో సమగ్ర వికేంద్రీకరణ బిల్లు
ప్రవేశపెడతాం ః ఎపి సిఎం జగన్
సాంకేతిక సమస్యలు చాలా
ఉన్నందున మూడు రాజధానులు
వెనక్కి ః కొడాలి నాని
ఇది అమరావతి రైతుల విజయం
కాదు.. నేను ఇప్పటికీ మూడు
రాజధానులకు కట్టుబడి ఉన్నా:
మంత్రి పెద్దిరెడ్డి 

మన తెలంగాణ/హై-దరాబాద్ : అమరావతి ప్రాంతమంటే తనకు వ్యతిరేకత లేదని, అ యితే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లులను వెనక్కి తీసుకుంటున్నామని ఎపి సిఎం జగన్ సోమవారం శాసనసభలో ప్రకటించారు. అన్ని అంశాలను పరిగణనలోనికి తీసుకుని పూర్తి సమగ్రమైన బిల్లుతో మళ్లీ సభ ముందుకు వస్తామని స్పష్టం చేశారు. 2020 నాటి చట్టం స్థానంలో కొత్త బిల్లు తెస్తామని వెల్లడించారు. వికేంద్రీకరణపై అనే క అపోహలు, అనుమానాలు వచ్చాయన్నారు. వికేంద్రీకరణే తమ ప్రభుత్వ అసలైన ఉద్దేశమని ప్రకటించారు. వికేంద్రీకరణపై న్యాయపరమైన వివాదాలు వచ్చాయని వెల్లడించారు. చట్టాన్ని మరింత మెరుగ్గా తెచ్చేందుకే ఈ నిర్ణయమని పేర్కొన్నారు. అమరావతి సిఆర్‌డిఎ చట్టాన్ని పునరుద్ధరిస్తూ సోమవారం ఎపి శాసనసభలో రాష్ట్ర ప్ర భుత్వం బిల్లును ప్రవేశపెట్టింది.

ఎపి పాలనా వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమీకృత అభివృద్ధి చట్టం రద్దు బిల్లును మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. మెట్రోపాలిటన్ రీజియన్ అథారిటీని తక్షణం రద్దు చేస్తున్నట్లు శాసనసభలో ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా సిఎం జగన్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధానిగా ఉండేదని, గుంటూరులో హై-కోర్టు ఉండేదన్నారు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాయలసీమకు న్యాయం చేయాల్సి ఉందన్నారు. 1956లో క ర్నూలు నుంచి రాజధాని, గుంటూరు నుంచి హైకోర్టును హైదరాబాద్‌కు తీసుకుపోయారన్నారు. ప్రస్తు తం అమరావతి ప్రాంతమంటే తనకు వ్యతిరేకత లేదని, తన ఇల్లు ఇక్కడే ఉందని, ఈ ప్రాంతమంటే తనకు ప్రేమ అని అన్నారు. ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి అయ్యే ఖర్చు ఎకరాకు రూ.2 కోట్లు చొప్పున 50 వేల ఎకరాలకు లక్ష కోట్లు అవుతుందని గత ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయన్నారు. ఈ ఖర్చు తాజా లెక్కల ప్రకారం అవుతుందన్నారు.

పదేళ్ల తర్వాత ఈ లక్ష కోట్ల విలువ ఆరేడు లక్షల కోట్లు అవుతుందని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు ఇవ్వడానికి డబ్బులు లేకపోతే రాజధాని ఊహా చిత్రం ఎలా సాధ్యమవుతుందన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించడం సమంజసమేనా? మనకు , మన పిల్లలకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి? పిల్లలందరూ పెద్ద నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలకు వెళ్లాల్సిందేనా? అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఎపిలో అతి పెద్ద నగరం విశాఖ అని పేర్కొన్నారు. అక్కడ అన్ని వసతులు ఉన్నాయని తెలిపారు. వాటికి అదనపు హంగులు అద్దితే, ఐదారేళ్ల తర్వాత అయినా హైదరాబాద్ వంటి నగరాలతో పోటీ పడే అవకాశం ఉందన్నారు. రాష్ట్రం పూర్తిగా అభివృద్ధిలో పరిగెత్తాలనే తాపత్రయంతోనే విశాఖలో కార్యనిర్వాహక రాజధాని, అమరావతిలో శాసనసభ, ఒకప్పటి రాజధాని అయిన కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి తద్వారా ప్రజలకు మంచి చేయాలనే ఈ ప్రభుత్వం అడుగులు వేసిందన్నారు. ఈ క్రమంలో ఏమేం జరిగాయో అన్నీ చూశాం, రకరకాల అపోహలు సృష్టించారు, న్యాయపరంగా చిక్కులు ఎదురయ్యేలా చూశారు.. ఇటువంటి నేపథ్యంలో ఈ ప్రకటన చేయాల్సి వస్తోందన్నారు.

రాజధానుల బిల్లు ఆమోదం పొందిన వెంటనే మూడు ప్రాంతాలకు న్యాయం చేసేలా మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభమై ఉంటే.. ఈ రోజు దాని ఫలితాలు ఈ పాటికే అందుబాటులోకి వచ్చి ఉండేవని తెలిపారు. నాటి శ్రీబాగ్ ఒడంబడిక స్ఫూర్తితో వెనుకబడిన ఉత్తరాంధ్ర సహా అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. అందుకే వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టామన్నారు. గతంలో కేంద్రీకరణ ధోరణులన ప్రజలు ఎంత వ్యతిరేకించారో 2019 సార్వత్రిక ఎన్నికల ద్వారా ప్రస్ఫుటంగా వ్యక్తమైందని తెలిపారు. మరోసారి హైదరాబాద్‌లాంటి సూపర్ క్యాపిటల్ మోడల్ వద్దే వద్దని, అటువంటి చారిత్రక తప్పిదానికి ప్రభుత్వం పాల్పడరాదని ప్రజల తీర్పు స్పష్టం చేసిందన్నారు. అందుకే వికేంద్రీకరణే సరైన విధానమని నమ్మి అడుగులు వేశామని తెలిపారు. అన్ని ప్రాంతాలు, కులాలు, మతాలు వీరందరి ఆశలు, ఆకాంక్షలను ప్రభుత్వం పరిగణనలోనికి తీసుకున్నదన్నారు. కాబట్టే ఈ రెండేళ్ల కాలంలో జరిగిన అన్ని ఎన్నికల్లో మన ప్రభుత్వాన్ని మనసారా దీవించారన్నారు. అయితే వికేంద్రీకరణకు సంబంధించి అనేక అపోహలు, అనుమానాలు, కోర్టు కేసులు, న్యాయపరమైన వివాదాలు, దుష్ప్రచారాలు చేశారన్నారు.

వికేంద్రీకరణ మంచిదని అడుగులు వేశామన్నారు. ఈ నేపథ్యంలో వికేంద్రీకరణ అవసరాన్ని మూడు రాజధానులకు సంబంధించిన బిల్లులోని ప్రభుత్వ సదుద్దేశాన్ని విపులంగా వివరించేందుకు, చట్ట, న్యాయపరంగా అన్ని సమాధానాలను బిల్లులో పొందు పర్చేందుకు, బిల్లులను మరింత మెరుగుపర్చేందుకు విస్తృతంగా వివరించేందుకు ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లు వెనక్కి తీసుకుంటున్నామన్నారు. అన్ని అంశాలను పరిగణనలోనికి తీసుకుని పూర్తి సమగ్రమైన, మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తాం అని సిఎం జగన్ శాసనసభలో ప్రకటించారు. దీంతో మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గేది లేదని ప్రభుత్వం చెప్పకనే చెప్పినట్లయింది. సభ మంగళవారానికి వాయిదా పడింది.

రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు : మంత్రి బుగ్గన

రాజధాని అంటే రియల్‌ఎస్టేట్ వ్యాపారం కాదని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. చంద్రబాబుది ఊహజనిత రాజధాని మాత్రమేనని బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శించారు. కోస్తాంధ్రను వెనుకబడిన ప్రాంతంగా శ్రీకృష్ణకమిటీ చెప్పలేదని మంత్రి బుగ్గన, అన్ని రాష్ట్రాలు వికేంద్రీకరణకే ప్రాధాన్యతనిచ్చాయని గుర్తు చేశారు. ఒక ప్రాంతం అభివృద్ధి చెందితే.. వేర్పాటు వాదం వస్తుందని శ్రీకృష్ణకమిటీ ఆనాడే చెప్పిందన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతాలని శ్రీకృష్ణకమిటీ చెప్పిందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని శివరామకృష్ణ కమిటీ స్పష్టం చేసిందని తెలిపారు.

టెక్నికల్‌గా చాలా సమస్యలు ఉన్నందునే : కొడాలి నాని

మూడు రాజధానుల నిర్ణయాన్ని జగన్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంపై పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పందించారు. సోమవారం అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడుతూ టెక్నికల్‌గా చాలా సమస్యలు వస్తున్నాయనే మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు కొడాలి నాని తెలియజేశారు. మూడు రాజధానుల రద్దుపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కేబినెట్ నిర్ణయాన్ని అసెంబ్లీలో ప్రకటిస్తామన్నారు.

మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నా : మంత్రి పెద్దిరెడ్డి

మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ కేవలం ఇంటర్వెల్ మాత్రమేనని.. శుభం కార్డుకు మరింత సమయం ఉందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకోవడం అమరావతి రైతుల విజయమేమీ కాదన్నారు. సాంకేతిక సమస్యలు సరిదిద్దేందుకే హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశామని చెప్పారు. తాను ఇప్పటికీ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. అమరావతి రైతుల పాదయాత్ర చూసి ప్రభుత్వం బిల్లులు ఉపసంహరించుకోలేదని అన్నారు. అది పెయిడ్ ఆర్టిస్టుల పాదయాత్ర అని విమర్శించారు. ఆ పాదయాత్ర ఏమైనా లక్షమందితో సాగుతోందా? అని ప్రశ్నించారు.

ఎంతోసేపు నిలవని అమరావతి రైతుల ఆనందం…

అనూహ్యంగా ఎపి ప్రభుత్వం మూడు రాజధానుల చట్టం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఆనందం వ్యక్తం చేస్తున్న అమరావతి రైతులకు ఆ ఆనందం ఎంతో సేపు నిలిచేలా లేదు. మూడు రాజధానుల చట్టం ఉపసంహరణ కేవలం ఇంటర్వేల్ మాత్రమేనని, సినిమా ఇంకా మిగిలే ఉందని చెబుతూనే పరోక్షంగా ఏదో మతలబు ఉందనే సంకేతాలిచ్చారు. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు దీనికి అద్దం పడుతున్నాయి.

కుట్ర ఏమైనా ఉందా? : ఎంపి రామ్మోహన్ నాయుడు

మూడు రాజధానుల బిల్లును ఎపి ప్రభుత్వం ఉపసంహరించుకోవడం మరో నాటకమే తప్ప రైతులకు న్యాయం చేసే ఉద్దేశం ఎక్కడా కనిపించట్లేదని టిడిపి ఎంపి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వం అకస్మాత్తుగా ఈ బిల్లును ఉపసంహరించుకోవడం వెనక ఏదైనా కుట్ర ఉందేమోనన్న అనుమానం కలుగుతోందన్నారు. వికేంద్రీకరణ బిల్లు రద్దు చేసేంతవరకూ రైతులకు టిడిపి అండగా ఉంటుందన్నారు. అమరావతి రైతులకు ఏ విధంగా న్యాయం చేయబోతున్నారు.. అమరావతిని ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారనే అంశాలపై స్పష్టత నివ్వాలని డిమాండ్ చేశారు. అత్యవసరంగా పాలనా వికేంద్రీకరణ బిల్లులను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందని టిడిపి ఎంఎల్‌ఎ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంశాన్ని సిఆర్డీఏ చట్టంలోనే తమ ప్రభుత్వం పొందుపర్చిన విషయాన్ని బుచ్చయ్య చౌదరి గుర్తు చేశారు. విశాఖపట్టణం, విజయనగరం సహా రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకమైన అభివృద్ధి జరగాలన్నది తాము పొందుపర్చామన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News