Friday, April 26, 2024

మద్యం మత్తులో వేగం.. గాలిలో ప్రాణం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీబ్యూరో: స్నేహితుల దినోత్సవం సందర్భంగా పార్టీకి వెళ్లిన స్నేహితులు కారు ప్రమాదం జరగడంతో ఒకరు మృతిచెందిన సంఘటన గచ్చిబౌలిలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ముగ్గురు మిత్రులకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. పోలీసుల కథనం ప్రకారం.. అభిషేక్, సత్యప్రకాష్, తరుణి, ఆశ్రిత స్నేహితులు. ఆదివారం స్నేహితుల దినోత్సవం కావడంతో నలుగురు కలిసి డిన్నర్‌కు వెళ్దామని ప్లాన్ చేసుకున్నారు. నలుగురు కలిసి కారులో కొండాపూర్‌లోని పబ్‌కు వెళ్లారు. అక్కడ పార్టీ చేసుకున్న నలుగురు కారులో బయలు దేరారు. ముందు సీటులో సత్యప్రకాష్ కూర్చోగా, అభిషేక్ డ్రైవింగ్ చేస్తున్నాడు. వెనుక సీటులో తరుణి, అశ్రిత కూర్చున్నారు. మద్యం మత్తులో ఉన్న అభిషేక్ కారును మితిమీరిన వేగంతో డ్రైవ్ చేయడంతో కొండాపూర్ మైహోం మంగళ వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న బండరాళ్లను ఢీకొని పల్టీకొట్టింది. ఈ క్రమంలోనే ఒక్కసారిగా కారు వెనుక డోరు తెరుచుకోవడంతో ఆశ్రిత (23) కారులో ఉంచి రోడ్డుపై పడిపోయింది. తలకు తీవ్ర గాయం కావడంతో ఆశ్రిత అక్కడికక్కడే మృతి చెందింది. ఆశ్రిత కెనడాలో ఎంఎస్ చదువుతోంది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు గాయపడిన ముగ్గురిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు గచ్చిబౌలి పోలీసులు తెలిపారు.

Woman dead in Car Accident at Kondapur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News