Saturday, April 27, 2024

పంజరంలో పక్షి స్వేచ్ఛా విహంగం

- Advertisement -
- Advertisement -

Women should have equal rights with men

 

లోకంలో రెండు పక్షులున్నాయి
ఒకటి బంగారు పంజరంలో
మరొకటి కానన సీమల్లో స్వేచ్ఛగా
ఒక సారి అవి కలుసుకున్నాయి అనుకోకుండా
బహుశా అది సృష్టికర్త చమత్కారమనుకుంటా
స్వేచ్ఛా పక్షి అన్నది
“ ఓ బందీ పక్షీ నా ప్రియా! నాతో అడవికి వచ్చేయ్ కలిసి ఎగురుదాం”
పంజరం పక్షి జవాబు
“హాయిగా ఉన్న నా పంజరంలోకి నువ్వే వచ్చేయ్. కొంచెం ప్రయత్నిస్తే నీవు దూరిపోగలవు”
స్వేచ్ఛా పక్షి “ఉహుహూ. ఈ బంధనాలు, కట్టుతాళ్ళూ నేనెప్పుడూ ఒప్పుకోను”
బందీ పక్షి “అయ్యో, ఈ దుర్గమ అడవి దారుల్లో తిరిగే ధైర్యం నాకెక్కడ ఉంది”
బయటి పక్షి ఎన్నో పాటలు పాడి వినిపిస్తుంది.

బందీ పక్షి కూడా ఎన్నో చిలుకపలుకులు పలికి వల్లిస్తుంది. కానీ ఆ మాటలు, తత్వమూ ఏవీ తనవి కావు.
స్వేచ్ఛావిహంగం అంటుంది “ఒక్కటైన మన పాట పాడవమ్మా”
బందీ జవాబు “ ప్రియా, నువ్వే వచ్చి చిట్టిపొట్టి పంజరం పాటలెన్నో నేర్చుకోవచ్చుగా!”
స్వేచ్ఛ అంటుంది “ఆపాటలు యాంత్రికం. ఒప్పచెప్పటం, పునశ్చరణం, నిశ్చలం అవినాకొద్దు”
“స్వేచ్ఛ మలిచిన నీ వనగీతాలను నేనెలా పాడగలను?” అని బందీ పక్షిదు:ఖపడింది.
“అల్లదిగో! విస్తృతమైన వినీలాకాశం. ఎక్కడా అడ్డంకులు, అవధులు లేనిది” స్వేచ్ఛ పిలుస్తోంది.
“ఇదిగో! చక్కని నా ఆశ్రమం. ఈ పంజరం సదుపాయంగా నియమానుసారం నిర్మించబడింది” బందీ అభిప్రాయం.
“కాదు నువ్వు పూర్తిగా బయటకు రా! ఆకాశ దేశంలో హాయిగా విహరిద్దాము”
“నా పంజరం ఎంతో సురక్షితం. నువ్వు ఓ మూల ఒదిగిపో”
“ఈపంజరంలో నా రెక్కలనెక్కడవిప్పుకోగలను?”

“మరి ఆ మేఘాల మాటున నేను కూర్చునేందుకు ఓ కమ్మీ అయినా లేదు.! ఇక నాకు ఆనందం ఎక్కడ?”
అంతే… ఆ రెండు పక్షులూ ప్రేమలో మునిగిపోయి కూడా , విడిగానే ఉండిపోయాయి.
పంజరం ఊచల మధ్య ఖళీల లోనుంచి ముక్కులు తాటించుకుంటూ,
విడిపోలేక దొంగచూపులు చూసుకుంటూ, భగ్నమైన హృదయంతో….
తమను తాము వివరించుకుంటూ, సమర్ధించుకుంటూ శక్తి కొద్దీ ప్రయత్నాలు,
పరస్పరం అర్థం చేసుకోలేక… నిష్ర్పయోజనంగా…
రెక్కలు టపటపా కొట్టుకుంటూ..ఒంటరి పాటుగా దు:ఖాలాపన
“ప్రియతమా, నా దగ్గరకు వచ్‌‌చు, నా బాధను తుడిచెయ్‌”“బయటకు దారిమూసుకుపోయిన నీ పంజరంలోకి వచ్చానా, నేను చస్తాను” స్వేచ్ఛా విహంగ స్వరం.
“ఎలా మరి నాకు ఎగరడానికి శక్తి లేదు.” బందీపక్షి వేదనాభారం.
v v v

విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ (7 మే 1861 7 ఆగస్టు 1941) అనేక సామాజిక తాత్విక విషయాలపై కవనం ఆలపించారు. అవి మానవ సమాజంలో అస్తిత్వ సంశయాలకు, సంవేదనలకు స్పందనలు. మానవ స్వభావానికి చెందిన లోతైన పరిశోధనలు, అత్యంత కళాత్మకంగా వెలువడిన భావనలు. ఆ రచనలు వాటి కవితా సౌందర్యం అనుపమానం. బెంగాలీ భాషలో వాటికి సాటి రాగల రచనలు లేవంటారు. అసలు రచనలతో పోలిస్తే వాటి అనువాదాలు చాలా పేలవంగా ఉంటాయని, వాటి నిగూఢ, మార్మిక, ఆధ్యాత్మిక సౌందర్యాన్ని ఏమాత్రం బట్వాడాచేయలేక పోయామని అమర్త్యసేన్ వంటి విజ్ఞులు వాపోయారు. టాగూర్ స్వయంగా చేసుకున్న ఇంగ్లీషు అనువాదాలు కూడా ఇందుకు మినహాయింపు కాదని ఈ రెండు భాషలు తెలిసిన వారు అంటారు. అందుకేనేమో ఇప్పటికీ అనేక టాగూర్ అనువాదాలు వెలువడుతుంటాయి. ఆయన రచనలలోని ఆలోచనా పటుత్వం, వాటి అంతర్గత సందేశం ఇతర కవిత్వాలను ఎంతో అధిగమించి పోతూ, చదువరిని ఉన్నతీకరిస్తుంది.

ప్రస్తుత కవితను టాగూర్ 1892లో రాశారు. “ఆధునిక సాహిత్య1894” లో ఈ గీతం గురించి ఇలా రాశారు. ‘మన మానవ స్వభావంలో ప్రకృతిలో స్వేచ్ఛగా విహరించే పురుషసత్వం (ఎశ్రీఱఅతీ వఅ్‌ఱ్) ఒకటి ఉంది. ఇది ఏ బంధాలకు కట్టుబడి ఉండడానికి ఇష్టపడదు. దీని పక్కనే ఒక స్త్రీ (వఎఱఅఱఅవ) అంశం ఉంది. అది ఇంటి గోడల మధ్య భద్రమైన సురక్షిత జీవనం కోరుకుంటుంది. దానికే ప్రాధాన్యతనిస్తుంది. విడదీయరాని అనుబంధంలో ఈ రెండూ కట్టుబడి ఉంటాయి. మొక్కవోని తన శక్తి సామర్థ్యాలను అభివృద్ధి పరచుకోవాలని అమిత ఆసక్తితో, అవి బహుముఖాలుగా విస్తరించాలని, ఎప్పటికప్పుడు నూతన జీవిత రుచులను ఆస్వాదించాలని కొత్త ప్రపంచాలను అన్వేషిస్తూ ఒకటి. సంప్రదాయ యోచనలతో, పూర్వనిర్ధారిత దృష్టితో, అలవాటైన ఆలోచనలు ఆచరణలతో చిక్కుకుపోయి మరొకటి.

ఒకటి నిన్ను విశాల ప్రపంచంలోకి తీసుకువెళుతుంది. మరొకటి నిన్ను ఇంటివైపు లాగుతున్నట్టు కనిపిస్తుంది. ఒకటి అడవిపక్షి మరొకటి పంజరం పక్షి. ఆ అడవిపక్షి సదా పాడుతూనే ఉంటుంది. ఈ గానంలో అదుపులేని స్వేచ్ఛాకాంక్షల గుసగుసలు, విస్తృత మధుర్యమూ ప్రతిఫలిస్తాయి.” అంటారు. ప్రస్తుత కవితలు ఈ రెండు లక్షణాలను రెండు పక్షులుగా ప్రతిరూపించారు. అయితే వాటిని స్త్రీలు, పురుషులు అనే వ్యక్తులుగా కన్నా, రెండు జాతులుగాకన్నా రెండు విరుద్ధ లక్షణాలుగా, రెండు స్వభావాలుగా పరిగణించాలి. ఈ స్వభావం ఏ వ్యక్తిలోనైనా ఉండవచ్చు. దాదాపు 200 సంవత్సరాల తర్వాత కూడా ఈ స్తితి, ముద్ర తొలిగిపోలేదని మనం చూస్తున్నదే. ఇప్పటికీ స్త్రీలను ఇంటి దీపాలుగాను, ఇంటి నిర్వాహకురాలిగానూ చూస్తున్నాం, అలాగే పెంచుతున్నాం, అదే నేర్పుతున్నాం. టాగూర్ ఈ కవిత రాసిన 150 సంవత్సరాల తర్వాత కూడా స్త్రీపురుష ధృవాలు దాదాపు అదే సంఘర్షణలో ఉన్నాయి. ఈ రెంటిలో సున్నితమైంది స్త్రీత్వం. అందుకే ఇంకా కొల్ల గొట్టబడుతోంది, ఆధిపత్యం, అజమాయిషీల కింద నలిగిపోతూనే ఉంది.

ఇప్పుడు ఇల్లు సురక్షితమేనా అన్న ప్రశ్న అలా ఉండనిచ్చి, సురక్షితమైన ఇంటికి, భద్రమైన జీవితానికి కట్టుబడి స్త్రీత్వం; విశృంఖల విహారానికి, దుస్సాహసిక ప్రవృత్తికి పురుషత్వం ప్రతీకలుగా మారాయి. ఈ రెండూ పరస్పర అభిముఖం. నిజానికి ద్వంద్వం. వీటి మధ్య సామాజికి సమతులం సాధించడమే సామరస్యం. ఈ స్వభావాల సమతులమే జీవన సౌగంధం.
ఈ సంభాషణా గీతంలో టాగూర్ ఇటు స్వేచ్ఛని, అటు బంధాన్నీ ఒకే తమకంతో వర్ణించారు. దాంతో ఆయన దేనిని సమర్ధిస్తున్నదీ తెలియదు. రెండింటిలోనూ ఆయన ఆనందం చూస్తున్నారా! అనిపిస్తుంది. “ దేన్నయినా త్యజించడంలో నాకు విమోచనం లేదు. వేయి బంధాల ఆనందం లోనే నేను స్వేచ్ఛ ఆలింగనపు అనుభూతిని పొందుతాను ” అంటారు ఆయన. టాగూర్ తాను భూమికి, మాతృభూమికి, దేశవాసులకి, అణగారిన ప్రజలకు కట్టుబడిఉన్నట్టు భావించారు. అయితే ఆయన సంపూర్ణ జీవన తాత్వికత మొత్తం స్వేచ్ఛ చుట్టూ పరిభ్రమిస్తుంది. స్వేచ్ఛకు టాగూర్ కల్పించిన రూపమే వినువీధుల్లో ఎగిరిపోతున్న పక్షి.
(డాక్టర్ మొనిష్ ఆర్ చటర్జీ 22 సెప్టెంబర్‌న కౌంటర్ కరెంట్స్ అన్న వెబ్ పత్రికలో టాగూర్ కవితకు ఇంగ్లీషు అనువాదం, వ్యాఖ్యానం ప్రచురించారు. దాని ఆధారంగా ఈ కవితానువాదం, వ్యాఖ్యానం.

 

                                                                         అనువాదం : డాక్టర్ ఎస్. జతిన్ కుమార్
                                                                         ఇంగ్లీషు మూలం : డాక్టర్ అనిష్ ఆర్ ఛటర్జీ

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News