ప్రభుత్వ మహిళా ఉద్యోగులు ఇళ్ల నుంచి బయటికి రావొద్దు
భద్రతా దళాలు అనుమతిస్తేనే రావాలి
తరలింపులను 31కల్లా పూర్తి చేయాలి
గడువు పొడిగించే ప్రసక్తే లేదు
అప్ఘన్ నిపుణుల తరలింపును
అమెరికా నిలిపివేయాలి
పంజ్షిర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకుంటాం
తాలిబన్లతో సిఐఎ రహస్య చర్చలు?
కాబూల్: అఫ్ఘనిస్థాన్ తాలిబన్ల వశమైన తర్వాత అక్కడి పరిస్థితులు రోజురోజుకు క్షీణిస్తున్నాయి. ముఖ్యంగా వారి హయాంలో మహిళలపై ఆంక్షలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ మహిళా ఉద్యోగులు బయటికి రావద్దనిహెచ్చరిస్తున్నారు. ఇళ్లలోనే ఉండాలని, భద్రతా దళాలు అనుమతిస్తేనే బయటికి రావాలని తాలిబన్లు హుకుం జారీ చేశారు. మరో వైపు అఫ్ఘనిస్థాన్నుంచి తరలింపు ప్రక్రియను ఎట్టిపరిస్థితుల్లోను ఈ నెల 31 కల్లా పూర్తిచేసుకోవాలని సూచించారు. ఈ డెడ్లైన్ను పొడిగించడానికి తమ గ్రూపు అంగీకరించదని తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ స్పష్టం చేశారు. ఈ నెల 31 లోగా తమ దేశం పౌరులందరినీ తరలించడం సాధ్యం కాదని యూరోపియన్ దేశాలు అంటుండగా, అఫ్ఘన్లో పౌరుల తరలింపును మరికొంతకాలం పొడిగించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్పై అన్ని వైపులనుంచి ఒత్తిడి వస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో గడవును పొడిగించే ప్రసక్తే లేదని తాలిబన్లు మరోసారి స్పష్టం చేయడం గమనార్హం. అఫ్ఘనిస్థాన్లో జనజీవనానికి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని, అయితే కాబూల్ విమానాశ్రయం వద్ద ఆందోళనకర పరిస్థితులు అందుకు ఆటంకంగా ఉంటున్నాయని ఆయన చెప్పారు. అఫ్ఘనిస్థాన్ను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో వేలాది మంది దేశం వీడి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. కాగా తాలిబన్లతో అమెరికా గూఢచార సంస్థ సిఐఎ డైరెక్టర్ భేటీపై తమకెలాంటి సమాచారం తెలియదని ముజాహిద్ చెప్పారు. అలాగని ఆ సమావేశం జరగలేదని కూడా తాను చెప్పలేనన్నారు. అఫ్ఘన్ నిపుణుల తరలింపును అమెరికా నిలిపివేయాలని, వారి వలసలను ప్రోత్సహించవద్దని అగ్రరాజ్యాన్ని తాలిబన్లు కోరారు. పంజ్షిర్ సమస్యను శాంతియతంగా పరిష్కరించుకుంటామని తెలిపారు.