Thursday, May 9, 2024

తియానన్మెన్ ఊచకోతకు 33 ఏళ్లు

- Advertisement -
- Advertisement -

జూన్ 4, 1989న, బీజింగ్‌లోని తియానన్మెన్ స్క్వేర్‌లో చుట్టుపక్కల వేలాది మంది శాంతియుత నిరసనకారులపై చైనా దళాలు ముప్పేట దాడి జరిపి అమానుషంగా చంపాయి. వేల మంది జైలు పాలయ్యారు. ఈ సంఘటన జరిగిన తర్వాత గత 33 సంవత్సరాలుగా చైనా ప్రధాన భూభాగంలో కనీసం ఈ దుర్దినాన్ని స్మరించుకోవడాన్ని సహితం నేరంగా పరిగణిస్తూ వస్తున్నారు.
ప్రపంచ చరిత్రలో అత్యంత అమానుష సంఘటనలలో ఒకటిగా చెప్పుకోదగిన తియానన్మెన్ ఊచకోత జ్ఞాపకార్థం చైనా అధికారులు గత ఏడాది కాలంగా కార్యకర్తలపై వేధింపులను పెంచారు. ప్రజాస్వామ్య అనుకూల ప్రదర్శనకారుల సామూహిక హత్యలను చైనా ప్రభుత్వం గుర్తించి, బాధ్యత వహించాలని హ్యూమన్ రైట్స్ వాచ్ వంటి అంతర్జాతీయ హక్కుల సంస్థలు కోరుతున్నా పట్టించుకోవడం లేదు.
అయినా కొన్ని దశాబ్దాలుగా చైనా ప్రజలలో స్వాతంత్య్రం కోసం ఏర్పడిన ప్రగాఢమైన ఆకాంక్షలకు ఈ రోజు ఓ గుర్తుగా ఉండిపోయింది. ప్రజల మనస్సులలో నుండి ఈ సంఘటన స్మృతులను చెరిపేయాలని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఎంతగా ప్రయత్నిస్తున్నా సాధ్యం కావడం లేదు. తియానన్మెన్ ఊచకోతకు న్యాయం కోసం దేశీయ, అంతర్జాతీయంగా వస్తున్న వొత్తిడులను చైనా ప్రభుత్వం లెక్కచేయడం లేదు. ఐరోపా యూనియన్, ఐక్యరాజ్య సమితి వంటి సంస్థలు మొక్కుబడిగా కొన్ని ఆంక్షలు విధించినా, అవన్నీ కాలక్రమంలో నిర్వీర్యమయ్యాయి. నిత్యం మానవ హక్కుల గురించి భారత్ వంటి దేశాలకు ఉపదేశాలు చేసేందుకు ప్రయత్నించే అమెరికా, ఐరోపా వంటి దేశాలు ఈ దారుణమైన ఉచకోత పట్ల చూసీచూడనట్లు వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం. రష్యాకు వ్యతిరేకంగా చైనాతో సంబంధాలు మెరుగు పరచుకునేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో చైనా అనుసరిస్తున్న దారుణమైన మానవ హక్కుల ఉల్లంఘనల పట్ల ఈ దేశాలు కొంత మేరకు ఉదాసీనంగా ప్రవర్తిస్తూ వచ్చాయి. చివరకు అమెరికా వంటి దేశాలలో మీడియా సహితం అటువంటి ధోరణినే కనబరుస్తూ వస్తున్నది.
ఈ మారణకాండ తదనంతర అణచివేతకు నిరంతర, సమన్వయ, అంతర్జాతీయ ప్రతిస్పందన లోపించడంతో బీజింగ్ తనకు అడ్డులేదనుకొంటూ ఇతరత్రా కూడా హక్కుల ఉల్లంఘనల విషయంలో నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నది. జిన్‌జియాంగ్‌లో ఒక మిలియన్ టర్కీ ముస్లింలను సామూహికంగా నిర్బంధించడం, హాంగ్ కాంగ్‌లో ప్రాథమిక స్వేచ్ఛను అణచివేసే జాతీయ భద్రతా చట్టాన్ని నేరుగా విధించడం వంటివి ఈ సందర్భంగా గమనార్హం. ఏప్రిల్ 1989లో బీజింగ్‌లోని తియానన్మెన్ స్క్వేర్, ఇతర చైనీస్ నగరాల్లో విద్యార్థులు, కార్మికులు, ఇతరులు శాంతియుతంగా సమావేశమై భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, జవాబుదారీతనం కోరుతూ అవినీతిని అంతం చేయాలని పిలుపునిచ్చారు. మే 1989 చివరిలో తీవ్రరూపం దాల్చిన నిరసనలకు ప్రభుత్వం స్పందించి యుద్ధ చట్టాన్ని ప్రకటించింది. కొంతకాలంగా అధికార పక్షంలో కొనసాగుతున్న కుమ్ములాటలు, ప్రజలలో ఆర్ధిక సంస్కరణలు నెమ్మదిగా కొనసాగుతూ ఉండడం పట్ల చెలరేగిన అసంతృప్తి నేపథ్యంలో దాదాపు కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి చైనా ప్రజలు సంసిద్ధమైన సమయం అది చెప్పవచ్చు. కానీ నిరసనలను నిరంకుశంగా అణచివేయగలిగారు.
జూన్ 3, 4 తేదీలలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌ఎ) సైనికులు శాంతియుత నిరసనకారులు, ప్రేక్షకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి చంపారు. బీజింగ్‌లో సైనిక హింసకు ప్రతిస్పందనగా కొంతమంది పౌరు లు ఆర్మీ కాన్వాయ్‌లపై దాడి చేసి వాహనాలను తగులబెట్టారు. తాను ఎటువంటి కవ్వింపు లేకుండా హత్యాకాండకు ప్రభు త్వం ఎప్పుడూ బాధ్యత వహించలేదు లేదా హత్యలకు ఏ అధికారులను చట్టబద్ధంగా బాధ్యులను చేయలేదు. ఈ సంఘటనలను పరిశోధించి వాస్తవాలను వెలుగులోకి తేవడం కోసం ప్రయత్నించిన అనేక మంది హత్యలకు గురవడంతో, గాయపడటంతో, బలవంతంగా అదృశ్యం కావడమో లేదా జైలులోకి నెట్టివేయబడడమో జరిగింది. కనీసం అటువంటి వారి డేటాను విడుదల చేయడానికి కూడా ప్రభుత్వం ఇష్టపడటం లేదు.
బీజింగ్, ఇతర నగరాల్లో ఉద్యమాన్ని అణచివేత సమయంలో మరణించిన 202 మంది వ్యక్తుల వివరాలను తియానన్మెన్ మదర్స్ డాక్యుమెంట్ చేశారు. ఈ సందర్భంగా ఎంత మంది చనిపోయారో ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. జూన్ 1989 చివరలో 200 మంది పౌరులు, అనేక డజన్ల మంది భద్రతా సిబ్బంది మరణించారని చైనా ప్రభుత్వం తెలిపింది. ఇతర అంచనాలు వందల నుండి అనేక వేల వరకు ఉన్నాయి.
2017లో బ్రిటన్ ప్రభుత్వం విడుదల చేసిన పత్రాల ప్రకారం 10,000 మంది వరకు మరణించారని అప్పటి చైనాలోని బ్రిటిష్ రాయబారి సర్ అలాన్ డొనాల్డ్ నుండి వచ్చిన దౌత్య కేబుల్ వెల్లడించింది.
గత సంవత్సరంలో హాంకాంగ్ అధికారులు తియానన్మెన్ ఊచకోత జ్ఞాపకార్థం ప్రయత్నించినందుకు వ్యక్తులను అరెస్టు చేసి విచారించారు. జాషువా వాంగ్, మీడియా మొగల్ జిమ్మీ లై, జర్నలిస్ట్ గ్వినేత్ హో, మాజీ శాసనసభ్యులు లెంగ్ క్వాక్-హంగ్, సిడ్ హో, ఆండ్రూ వాన్‌లతో సహా ఇరవై ఆరు మంది ప్రజాస్వామ్య అనుకూల కార్యకర్తలు అరెస్ట్ చేశారు. వారు చేసిన నేరం నిరసనల్లో పాల్గొనడమో లేదా పాల్గొనడానికి లేదా ఇతరులను పాల్గొనడానికి ‘ప్రేరేపించిన’ కారణంగానో అరెస్ట్‌కు గురయ్యారు.
హ్యూమన్ రైట్స్ వాచ్‌లోని సీనియర్ చైనా పరిశోధకుడు యాగియు వాంగ్ మాట్లాడుతూ ‘తియానన్మెన్ ఊచకోత వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హాంకాంగ్ కార్యకర్తలు ఇప్పుడు జైలులో ఉన్నారు. కానీ చరిత్ర ఏదైనా మార్గదర్శి అయితే అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ చైనా ప్రజల మనస్సుల నుండి తియానన్మెన్ అణచివేత జ్ఞాపకాన్ని తుడిచివేయదు’ అని స్పష్టం చేశారు.
జనవరి 2022లో న్యాయస్థానం మానవ హక్కుల న్యాయవాది చౌ హాంగ్-తుంగ్‌కు 2021 తియానన్మెన్ నిరసనలో పాల్గొనడానికి, ఇతరులను పాల్గొనేలా ప్రేరేపించినందుకు 15 నెలల జైలు శిక్ష విధించింది. 2020 నిరసనలో పాల్గొన్నందుకు చౌ ఇప్పటికే 12 నెలల శిక్షను అనుభవిస్తోంది. చౌ చైనా పేట్రియాటిక్ డెమోక్రాటిక్ మూవ్‌మెంట్‌కు మద్దతుగా హాంకాంగ్ అలయన్స్ వైస్ చైర్‌వుమన్, వార్షిక నిరసన నిర్వాహకులు. హాంకాంగ్ అధికారులు 2020, 2021లలో విక్టోరియా పార్క్‌లో నిరసనలను నిషేధించారు. సెప్టెంబర్ 2021లో అలయన్స్ నిర్వహిస్తున్న జూన్ 4 వ తేదీ మ్యూజియం ప్రాంగణంపై పోలీసులు దాడి చేయడంతో మూడు నెలల ముందు దానిని మూసివేయవలసి వచ్చింది. హాంకాంగ్ విశ్వవిద్యాలయాలు తియానన్మెన్ స్మారక చిహ్నాలను తొలగించాయి. డిసెంబర్ 2021లో హాంకాంగ్ విశ్వవిద్యాలయం యూనివర్శిటీ ప్రాంగణం నుండి ఊచకోత బాధితులను స్మరించుకునే పెద్ద శిల్పం ‘సిగ్గు స్తంభం’ ను తొలగించింది.
చైనీస్ అధికారులు ఈ రోజుల్లో తియానన్మెన్‌లో ఏమి జరిగిందో ప్రస్తావించడాన్ని ద్వేషిస్తున్నారు. ఎందుకంటే ఇది మార్క్సిస్ట్- లెనినిజానికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు. ఒకానొక సమయంలో ఎక్కువగా బీజింగ్ నుండి రిక్రూట్ అయినా 38వ కంబైన్డ్ ఆర్మీ కార్ప్ వీధుల్లో ప్రజలను కాల్చివేస్తున్న 27వ కంబైన్డ్ కార్ప్‌పై కాల్పులు జరపడానికి సిద్ధపడింది. ఈ వ్యవహారమంతా చాలా మంది సామాన్యులకు వ్యవస్థ పట్ల ఉన్న అసహ్యాన్ని వెల్లడి చేస్తుంది. ఈ ఉచకోతను చైనా ప్రభుత్వం ప్రస్తావించడం చాలా అరుదు. అటువంటి అత్యంత అరుదైన ఓ సందర్భంలో జూన్ 2, 2019న చైనా రక్షణ మంత్రి 1989 సంఘటనలను ప్రస్తావించారు. ‘కేంద్ర ప్రభుత్వం రాజకీయ గందరగోళాన్ని అణచివేయాల్సి వచ్చింది. ఇది సరైన విధానం. దీని కారణంగా చైనా స్థిరత్వాన్ని పొందగలిగింది‘ అని సమర్ధించుకున్నారు.

 చలసాని నరేంద్ర, 9849569050

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News