హైదరాబాద్: తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ కేసులో పది మందిని అరెస్టు చేశామని సిపి అంజనీకుమార్ తెలిపాడు. యూనియన్ బ్యాంక్ ద్వారా గత నెల 27న తమకు ఫిర్యాదు అందిందని, నిధుల గోల్మాల్ స్కామ్లో ముగ్గురిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసి విచారణ చేశామన్నారు. తెలుగు అకాడమీలో మొత్తం రూ.64.50 కోట్ల గోల్మాల్ జరిగిందన్నారు. డిసెంబర్ నుంచి దఫా దఫాలుగా నిధులు విత్ డ్రా చేసినట్లు విచారణలో తేలిందన్నారు.
తెలుగు అకాడమీ ఆఫీసర్ రమేష్, చందానగర్ కెనరా బ్యాంక్ మేనేజర్ సాధన, రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటకోటి సాయికుమార్లను అరెస్ట్ చేశామన్నారు. నిధుల గోల్మాల్ విషయంలో సాయికుమార్ ప్రమేయం కీలకంగా ఉందన్నారు. సాయికుమార్పై మూడు కేసులు ఉన్నట్టు విచారణలో తేలిందన్నారు. 2015 ఎపి హౌసింగ్ బోర్డు స్కామ్లో ఇతడిని గతంలో సిఐడి విచారించిందని, రూ.25 కోట్లు మోసం చేసిన కేసులో చెన్నై పోలీసులు సాయికుమార్ను గతంలో అరెస్టు కూడా చేశారని చెప్పారు. ప్రస్తుతం నిందితుల దగ్గర నుంచి రూ.12 లక్షలు వరకు సీజ్ చేశామన్నారు.