దంతెవాడ: ఛత్తీస్గఢ్లోని నక్సల్స్ ప్రభావిత దంతెవాడ జిల్లాలో మంగళవారం 10 మంది నక్సల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో నలుగురికి 2018లో జరిగిన నీలవాయ దాడితో సంబంధమున్నట్లు పోలీసులు తెలిపారు. మావోయిస్టు పార్టీకి చెందిన మలంగిర్ ఏరియా కమిటీ సభ్యులైన ఈ 10 మంది నక్సల్స్ పోలీసులు, సిఆర్పిఎఫ్ అధికారుల ముందు లొంగిపోయినట్లు దంతెవాడ ఎస్పి అభిషేక్ పల్లవ తెలిపారు. స్థానిక పోలీసులు ప్రకటించిన లొంగుబాటు-పునరావాస ప్రచారానికి ఆకర్షితులైనట్లు వీరు చెప్పారని, అలాగే మావోయిస్టుల డొల్ల సిద్ధాంతాల పట్ల నిరాశతో తాము లొంగిపోతున్నట్లు వారు చెప్పారని ఎస్పి వివరించారు.
లొంగిపోయిన నక్సల్స్లో ఐదుగురిపై ఉమ్మడిగా రూ. 10 లక్షల నగదు బహుమతి ఉందని ఆయన చెప్పారు. ఛత్తీస్గఢ్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు నీలవాయ గ్రామం వద్ద 2018 అక్టోబర్ 30న దూరదర్శన్ కేంద్రకు చెందిన ముగ్గురు సభ్యుల బృందాన్ని ఎస్కార్ట్గా వెళుతున్న పోలీసు సిబ్బందిపై దాడి చేసిన నక్సల్స్ బృందంలో ఉన్న ఐదుగురు లొంగిపోయిన వారిలో ఉన్నట్లు ఆయన చెప్పారు. నీలవాయ దాడిలో ముగ్గురు పోలీసులు, ఒక డిడి కెమెరామెన్ మరణించిన విషయం తెలిసిందే. లొంగిపోయిన నక్సల్స్కు తక్షణ సహాయంగా రూ. 10,000 నగదు, పునరావాస పథకం కింద ఇతర సౌకర్యాలు అందచేస్తామని ఎస్పి తెలిపారు.