Saturday, April 27, 2024

సానుభూతి వీచేనా..నాన్నలు గెలిపించేనా..ఎన్నికల్లో బరిలో 16 మంది వారసులు

- Advertisement -
- Advertisement -

ప్రచారంలో తండ్రి చేసిన అభివృద్ది ప్రజలకు వివరణ
తండ్రి ఆశయాలు కొనసాగిస్తానని వాగ్దానాలు
సానుభూతి విజయ తీరాలకు చేర్చుతుందని అభ్యర్థుల ఆశలు

మన తెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. ఆరు రోజులే ప్రచారానికి గడువు ఉండటంతో అభ్యర్థులు రాత్రింబళ్లు ప్రచారంలో మునిగిపోయారు. ఈసారి విజయం సాధించే లక్ష్యంతో బరిలో నిలిచిన నేతలు.  ఎత్తుకు పైఎత్తులు వేస్తూ విజయ బావుటా ఎగురవేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. అందులో భాగంగా ఈసారి ఎన్నికల్లో నాన్నల పేరు మీద టికెట్లు సంపాదించుకున్న యువ అభ్యర్థులు తండ్రుల ఫోటోలతో జపం చేస్తూ ప్రచార రథాలపై పరుగులు పెడుతూ గతంలో వారు నియోజకవర్గంలో చేసిన అభివృద్ది, పేదలకు ప్రభుత్వ పథకాలు అందించిన తీరును వివరిస్తున్నారు. తన తండ్రి అడుగుజాడల్లో నడిచి పేదల పక్షాన పోరాటం చేస్తానని పేర్కొంటూ ఈఎన్నికల్లో తనను గట్టెక్కించాలని కోరుతున్నారు.

ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల పోరులో కంటోన్మెంట్ నుంచి ప్రజా యుద్ద నౌక గద్దర్ కూతురు జి.వి.వెన్నెల కాంగ్రెస్ తరపున పోటీ చేస్తుంది. తన తండ్రి పేదల కోసం కాలుకు గజ్జెకట్టిన పాట పడుతూ ప్రజలను చైతన్యవంతం చేయడంలో కీలక పాత్ర పోషించి జీవితం ప్రజల కోసమే ఆర్పించాడని ప్రచారంలో పేర్కొంటుంది. తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా పనిచేసి బడుగు, బలహీనవర్గాల అభివృద్దికి పాటు పడుతానని చెబుతుంది. అదే నియోజకవర్గం నుంచి గ్రేటర్ హైదరాబాద్‌లో సీనియర్ నాయకుడు, ఐదుసార్లు అదే నియోజకవర్గం నుంచి ప్రాతినిద్యం వహించిన జి. సాయన్న కూతురు లాస్య నందిత బిఆర్‌ఎస్ నుంచి బరిలో నిలిచి తండ్రి నియోజకవర్గంలో చేసిన అభివృద్ది, సంక్షేమ పేరుతో ఓటర్ల వద్దకు వెళ్లుతూ తనకు ఈఎన్నికల్లో మద్దతు ఇచ్చి అసెంబ్లీలో అడుగు పెట్టేలా దీవించాలని వేడుకుంటుంది. గతంలో కార్పొరేటర్‌గా పనిచేయడంతో కొద్దిగా రాజకీయ అనుభవం ఉండటంతో ప్రజల ఆకట్టుకుంటుంది.

వీరితో పాటు హైదరాబాద్‌లో పేదల నాయకుడిగా పేరుపొందిన పి. జనార్ధన్‌రెడ్డి(పిజెఆర్) కూతురు విజయారెడ్డి ఖైరతాబాద్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేస్తోంది. అదే నియోజకవర్గం నుంచి పిజెఆర్ ఐదు పర్యాయాలు విజయం సాధించిన రాజధాని నగరంలో ఆయన పేరు అంటే తెలియని వారు ఉండరు. ప్రస్తుతం ఆయన చేసిన పనులను ప్రజలకు వివరిస్తూ ఈసారి ప్రజలు తనను ఆదరించాలని కోరుతుంది. నారాయణపేట నియోజకవర్గం నుంచి చిట్టెం పర్ణికారెడ్డి తన తాతా నర్సిరెడ్డి, తండ్రి వెంకటేశ్వర్‌రెడ్డి చేసిన సేవలు ప్రజలకు చెబుతూ ఈ ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు. ములుగు నియోజకవర్గం నుంచి బడే నాగజ్యోతి తన తండ్రి బడే నాగేశ్వర్‌రావు పేద ప్రజల కోసం పోరాట చేశాడని ఆయన ఆశయాలు నేరవేర్చేవిధంగా ప్రజలకు సేవలందిస్తానని పేర్కొంటూ ఎన్నికల్లో తానను దీవించాలని ప్రచారం చేస్తుంది.

నాగార్జునసాగర్ నుంచి సీనియర్ నాయకుడు నోములు నర్సింహ్మయ్య తనయుడు నోముల భగత్‌కుమార్ కూడా రెండోసారి బరిలో ఉంటూ తన తండ్రి ప్రజలకు అందించిన విధంగా ప్రజాసేవ చేస్తానని ప్రచారంలో చేస్తూ తనను ప్రజలు మరోసారి చట్ట సభకు పంపే అవకాశం కల్పించాలని దండాలు పెడుతున్నారు. ములుగు నుంచి బిజెపి తరుపున మాజీ మంత్రి చందులాల్ తనయుడు ఆజ్మీరా ప్రహ్లాద్ కూడా పోటీ చేస్తూ తన తండ్రి నియోజకవర్గం అభివృద్దికి పాటు పడ్డారని ఆయన బాటలో నడిచి పేదల కోసం నిరంతరం పాటు పడుతారని పేర్కొంటూ మొదటిసారి అసెంబ్లీ అడుగు పెట్టేలా చూడాలని కోరుతున్నారు.

వీరితో పాటు తండ్రుల వృద్దాప్యంతో వారి స్థానంలో వేములవాడ నుంచి చేనమనేని విద్యాసాగర్ తనయుడు వికాస్‌రావు, కోరుట్ల నుంచి కల్వకుంట్ల విద్యాసాగర్ కూమారుడు సంజయ్, నాగర్‌కర్నూల్ నుంచి కూచకుళ్ల దామోదర్‌రెడ్డి తనయుడు రాజేష్‌రెడ్డి, మహబూబ్‌నగర్ మాజీ ఎంపి జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్‌రెడ్డి, నాగార్జునసాగర్ నుంచి మాజీ మంత్రి జానారెడ్డి తనయడు జైవీర్‌రెడ్డి, మెదక్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నుంచి మైనంపల్లి హన్మంతరావు పుత్రుడు మైనంపల్లి రోహిత్‌రావు, శేరిలింగంపల్లి బిజెపి నుంచి ఎం. రవికుమార్ యాదవ్, కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతగా నాలుగు దశబ్దాల పాటు పనిచేసిన గడ్డం వెంకటస్వామి కుమారులు ఆశించిన స్ధాయిలో రాజకీయాల్లో ఎదగలేకపోవడంతో ఈఎన్నికల్లో బెల్లంపల్లి నుంచి గడ్డం వినోద్, చెన్నూర్ నుంచి వివేక్ వెంకటస్వామి బరిలో నిలిచి తన తండ్రి చూపిన బాటలో నడిచి పేద ప్రజలకు జీవితాంతం సేవలందిస్తామని ప్రచారంలో వాగ్దానం చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News