రక్షణ కల్పించాలని తాలిబన్లకు ఐఎఫ్జె విజ్ఞప్తి
పెషావర్: అఫ్ఘానిస్థాన్ నుంచి తమను సురక్షితంగా తరలించాలని కోరుతూ రెండువేలమంది జర్నలిస్టులు దరఖాస్తులు పంపించారని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్(ఐఎఫ్జె) వెల్లడించింది. భయానక పరిస్థితులు నెలకొన్నదృష్టా అఫ్ఘన్ జర్నలిస్టులకు కాబూల్ విమానాశ్రయం నుంచి బయటపడేందుకు రక్షణ ఏర్పాట్లు చేయాలని తాలిబన్ ప్రభుత్వాన్ని ఐఎఫ్జె కోరింది. అఫ్ఘన్ జర్నలిస్టులకు వీసాలు జారీ చేయాలని యూరోపియన్ దేశాలైన స్పెయిన్, ఉత్తరమాసిడోనియా, ఫ్రాన్స్, మెక్సికో, ఇటలీ, జర్మనీ, యుకె, అమెరికా, కెనడా దేశాలకు విజ్ఞప్తి చేశామని.. అయితే, ఏ ఒక్క దేశం కూడా 10 నుంచి 15కన్నా ఎక్కువగా ఇవ్వలేమని చెప్పాయని ఐఎఫ్జె డిప్యూటీ సెక్రటరీ జనరల్ జేరిమీ డియర్ తెలిపారు. అఫ్ఘన్ను వీడుతామని అభ్యర్థిస్తున్న జర్నలిస్టుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని ఆయన తెలిపారు. విదేశీ వీసాలతో కాబూల్ను వీడేందుకు జర్నలిస్టులకు తాలిబన్ ప్రభుత్వం అనుమతించడంలేదని, దాంతో తామేమీ చేయలేని పరిస్థితి నెలకొన్నదని ఆయన వాపోయారు.