తిరువనంతపురం : ఇటీవల జరిగిన కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార లెఫ్ట్ డెమొక్రటిక్ ఫంట్ (ఎల్డిఎఫ్) విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 941 స్థానాలకు గాను ఎల్డిఎఫ్ 516పైగా స్థానాల్లో విజయకేతనం ఎగరేసి పూర్తి ఆధిక్యతను కనబర్చింది. కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్కు జరిగిన ఎన్నికల్లో 21 ఏళ్ల ఆర్యా రాజేంద్రన్ విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్శించారు. తాజా ఎన్నికల్లో విజయం సాధించిన అతిపిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందారు. విపక్ష కూటమి నుంచి సీనియర్ అభ్యర్థి బరిలో నిలిచినప్పటికీ.. ఆమె ముందు నిలవలేదు. అయితే అనూహ్యంగా ఆమె మేయర్ అభ్యర్థిగా ఖరారు అయ్యారు.
తిరువనంతపురం మేయర్ అభ్యర్థిగా ఆర్యా రాజేంద్రన్ను ఎంపిక చేస్తున్నట్లుఎల్డిఎఫ్ పెద్దలు ప్రకటించారు. దీంతో దేశంలో అతిపిన్న వయసులో మేయర్ పీఠం అధిరోహించిన యువతిగా ఆమె రికార్డు సృష్టించనున్నారు. స్థానిక ఎల్బిఎస్ కాలేజీలో బిఎస్సి మ్యాథమేటిక్స్ విద్యను అభ్యసిస్తున్నారు. అంతేకాకుండా స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో పార్టీ వ్యవహారాల్లోనూ ఆర్య కీలకంగా పాత్ర పోషిస్తున్నారు. ఎన్నికల్లో విజయంపై ఆమె స్పందిస్తూ… రాష్ట్రంలో విద్యాభివృద్ధికి మరింత కృషి చేస్తానన్నారు.