Sunday, May 12, 2024

రఫాలో ఇజ్రాయెల్ వైమానిక దాడులకు 28 మంది పాలస్తీనియన్ల బలి

- Advertisement -
- Advertisement -

రఫా (గాజా స్ట్రిప్ ) : రఫా లోని పౌరుల నివాసాలపై శనివారం తెల్లవారు జామున ఇజ్రాయెల్ మూడుసార్లు వైమానిక దాడులు జరపడంతో 28 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. మూడు కుటుంబాలకు చెందిన వారు ఈ దాడులకు బలైపోయారు. వీరిలో పది మంది పిల్లలుండగా, అందులో మూడు నెలల పసికందు ఉండడం అత్యంత శోచనీయం. అనేక మంది గాయపడ్డారు. నేలపై పోరు ప్రారంభించే ముందు దక్షిణ గాజా సిటీ నుంచి వేలాది మంది ప్రజలను వెంటనే ఖాళీ చేయించాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆదేశించిన కొన్ని గంటల్లోనే ఈ దాడులు జరగడం గమనార్హం. ఇప్పటికే చాలా మందిని గాజా నుంచి తరలించినప్పటికీ, మొత్తం 2.3 మిలియన్ మందిలో సగం కన్నా ఎక్కువ మందే గాజా భూభాగంలో రెండింట మూడొంతుల భూభాగాన్ని ఆక్రమించి ఉన్నారు.

గాజాలో పాలస్తీనియన్లపై దాడులు పెరుగుతుండడం అమెరికాకు ఆందోళన కలిగిస్తోంది. పౌరుల నివాసాల నుంచి హమాస్ దాడులు చేస్తుండడమే ప్రజలు బలికావడానికి కారణమౌతోందని ఇజ్రాయెల్ చెబుతోంది. ఈజిప్టు సరిహద్దులోగల రఫాలో హమాస్ ఉగ్రమూకలకు చివరగా మిగిలిన ఏకైక బలమైన స్థావరం ఉందని, అక్కడి నాలుగు హమాస్ బెటాలియన్లను నిర్మూలించకుండా విడిచిపెడితే తాము లక్షాన్ని సాధించలేమని ఇజ్రాయెల్ వాదిస్తోంది. ఇజ్రాయెల్ భౌగోళిక , వైమానిక దాడులు ఇంతవరకు 28 వేలమంది పాలస్తీనియన్లను బలిగొన్నాయి. వీరిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే. గాజా లోని 2.3 మిలియన్ మంది ప్రజల్లో 80 శాతం మంది నిర్వాసితులయ్యారని స్థానిక వైద్య ఆరోగ్య వర్గాలు చెబుతున్నాయి. ఇంకా మిగిలిఉన్నవారికి ఆహారం, వైద్య సేవలు అందక మానవతా సంక్షోభం నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News