హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 397 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 92 మంది ఉండగా ఆదిలాబాద్లో 7, భద్రాద్రి 15 , జగిత్యాల 9, జనగాం 5, భూపాలపల్లి 7, గద్వాల 2, కామారెడ్డి 3, కరీంనగర్ 25 ,ఖమ్మం 12, ఆసిఫాబాద్ 8, మహబూబ్నగర్ 8, మహబూబాబాద్ 10, మంచిర్యాల 7, మెదక్ 2, మేడ్చల్ మల్కాజ్గిరి 37, ములుగు 7, నాగర్కర్నూల్ 8, నల్గొండ 11, నారాయణపేట్ 2, నిర్మల్ 4, నిజామాబాద్ 5, పెద్దపల్లి 10, సిరిసిల్లా 5, రంగారెడ్డి 28, సంగారెడ్డి 9, సిద్ధిపేట్ 6, సూర్యాపేట్ 11, వికారాబాద్ 2, వనపర్తి 4, వరంగల్ రూరల్ 7, వరంగల్ అర్బన్ లో 19, యాదాద్రిలో మరో 10 మందికి వైరస్ సోకింది. అదే విధంగా వైరస్ దాడిలో మరో ఇద్దరు మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,85,465కి చేరగా, డిశ్చార్జ్ల సంఖ్య 2,77,931కి చేరింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్లో 44 కేంద్రాల్లో ఆర్టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా,1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు తెలిపారు.
1535కు పెరిగిన కరోనా మరణాలు…
కరోనా వైరస్ దాడిలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1535 మంది చనిపోయినట్లు ఆరోగ్యశాఖ హెల్త్ బులెటెన్లో పేర్కొంది. అయితే ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన దగ్గర వైరస్ తీవ్రత అతి తక్కువగా ఉందని అధికారులు అంటున్నారు. దీంతోనే తెలంగాణలో డెత్ రేట్ 0.53 శాతంగా నమోదైంది. అంటే ఇది దేశ సగటు 1.4 కంటే అధికంగా తేలడం గమనార్హం. పేషెంట్లకు సకాలంలో వైద్యం అందించడం వలనే బాధితులు వేగంగా కోలుకుంటున్నారని ఆరోగ్యశాఖ చెబుతోంది. దీంతో రికవరీ రేట్ కూడా ఏకంగా 97.36 శాతానికి పెరిగింది. అంటే ప్రతి వందలో 97 మంది సులువుగా కోలుకుంటున్నారని హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు పేర్కొన్నారు.
హీరోలు రామ్ చరణ్, వరుణ్ తేజ్లకు పాజిటివ్….
హీరో రామ్చరణ్ కరోనా బారిన పడ్డారు. తనకు ఎలాంటి లక్షణాలు లేకుండానే వైరస్ సోకినట్లు ఆయన సోమవారం ఉదయం ప్రకటించారు. అంతేగాక తనకూ కరోనా సోకినట్లు అదే ఫ్యామిలీకి చెందిన మరోక హీరో వరుణ్ తేజ్ తెలిపారు. దగ్గు, జలుబు వంటి స్పల్ప లక్షణాలు తేలగా టెస్టు చేయించుకోగా తనకు పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ఆయన స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. దీంతో ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్నానని, వైద్యులు సూచించిన నిబంధనలను పాటిస్తున్నానని ఇద్దరు హీరోలు పేర్కొన్నారు.
ఎంఎల్ఏ మదన్ రెడ్డికి వైరస్ ..
నర్సాపూర్ ఎంఎల్ఏ చిలుముల మదన్రెడ్డి కొవిడ్ 19 బారిన పడ్డారు. ఇటీవల తిరుమల నుంచి వచ్చిన తర్వాత జ్వరం రావడంతో టెస్టింగ్కు వెళ్లగా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. గత వారం రోజులుగా తనను కలసిన వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని ఆయన సూచించారు.