Monday, April 29, 2024

యువతకు టాస్క్

- Advertisement -
- Advertisement -

50 Thousand jobs notification

 

దేశంలో తొలిసారిగా రాష్ట్ర నైపుణ్య పరిజ్ఞాన అకాడమీ
ఏర్పాటు చేయదలిచినట్టు ముఖ్యమంత్రి ప్రకటన
ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవం సందర్భంగా యువతకు కెసిఆర్ శుభాకాంక్షలు
50వేల ఉద్యోగాల భర్తీకి కార్యాచరణ ప్రారంభం
ఏడేళ్ల కార్యాచరణ కొలిక్కి వచ్చింది : సిఎం

మన తెలంగాణ/హైదరాబాద్ : నూతన జోన్ల ఆమోదం తర్వాత జోన్లలో క్లారిటీ రావడంతో రాష్ట్రంలో మరో యాభై వేల ఉద్యోగాల కోసం కార్యాచరణ ప్రారంభమైందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఐటి సాంకేతిక రంగాల్లో ఉద్యోగాలు లభించే విధంగా దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర నైపుణ్య పరిజ్ఞాన అకాడెమీ (టాస్క్)ని ఏర్పాటు చేస్తామన్నారు. దీని ద్వారా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకున్న యువతీ యువకులకు సాంకేతిక, సాంకేతికేతర రంగాలలో పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్య శిక్షణను అందిస్తున్నామని గురువారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో సిఎం కెసిఆర్ తెలిపారు. ఇప్పటికే యువతను ప్రోత్సహించేలా ఐటి పాలసీని రూపొందించామన్నారు. ప్రత్యేకంగా టి సాట్ ద్వారా నిరుద్యోగ యువతకు వివిధ స్థాయిల్లో అవగాహనతో పాటు శిక్షణాకార్యక్రమాలను అందిస్తున్నామన్నారు.

పరిశ్రమలు ఐటి రంగంలో లక్షలాది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ప్రభుత్వం కల్పించిందని సిఎం అన్నారు. ప్రభుత్వ రంగంలో ఇప్పటికే లక్షా ముప్పై వేలకు పైగా ఉద్యోగాలిచ్చిందన్నారు. భవిష్యత్తులో ఉద్యోగల నియామకాలు పూర్తిగా జాబ్ క్యాలెండర్ ద్వారా చేపట్టనున్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం (world youth skills day) సందర్భంగా రాష్ట్ర యువతకు సిఎం కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మారిన కాలమాన పరిస్థితుల్లో యువత మరింత సమర్థవంతంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలన్నారు. రాష్ట్ర యువత ఎంతో సమర్థవంతమైందని వారికి నైపుణ్యాలు తోడయితే తిరుగులేని యువశక్తిగా అవతరిస్తుందన్నారు. యువతలో నైపుణ్యాల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తున్నదని తెలిపారు. పారిశ్రామిక, వాణిజ్యం,ఐటి రంగాలు సహా వ్యవసాయం దాని అనుబంధ రంగాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో లక్షలాదిగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన జరగుతుందని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయన్నారు.

శిధిలమైన వ్యవస్థను పునరుజ్జీవింప చేశాం

సాధించుకున్న రాష్ట్ర ఫలాలను వర్తమాన, భవిష్యత్తు యువతరానికి పూర్తిస్థాయిలో అందించేలా ప్రభుత్వం తెలంగాణను తీర్చిదిద్దుతున్నదని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. అందుకు తగ్గట్టుగా పకడ్బందీ ప్రణాళికలను రచించి అమలు చేస్తున్నదన్నారు. గత పాలనలో అన్నిరంగాల్లో శిధిలమైన రాష్ట్ర మౌలిక వసతులను తీర్చిదిద్దుకుని, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా పునరుజ్జీవింపచేసుకుంటూ వస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. సకల జన జీవనం గుణాత్మకంగా అభివృద్ధి చెందిననాడే నిజమైన అభివృద్ధి అని ప్రభుత్వం విశ్వసించిందన్నారు. అందుకు అనుగుణంగానే ప్రాధాన్యతక్రమంలో అభివృద్ధి కార్యాచరణ చేపట్టిందన్నారు.

ఏడేళ్ల కార్యాచరణ కొలిక్కి వచ్చింది

రాష్ట్ర గ్రామీణ పట్టణ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనే ధ్యేయంగా ఏడేండ్లుగా అమలు పరుస్తున్న ప్రభుత్వ కార్యాచరణ కొలిక్కివచ్చిందని సిఎం కెసిఆర్ తెలిపారు. సంపదను సృష్టించి దాన్ని ప్రజలకు పంచడం అనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. పునర్నిర్మితమైన రాష్ట్ర స్వరాష్ట్ర ఫలాలను యువతీ యువకులు అనుభవించే పరిస్థితులు నేడు తెలంగాణ వ్యాప్తంగా నెలకొన్నాయని సిఎం అన్నారు. సాగునీరు, తాగునీరు విద్యుత్తు రంగాలను గాడిలో పెట్టి, వ్యవసాయాన్ని అభివృద్ధిపరిచి, రైతు సహా సబ్బండ వర్గాల సంక్షేమానికి అనేక పథకాలను అమలుపరుస్తూ వస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సమీకృత అభివృద్ధి కార్యాచరణ సత్పలితాలనిస్తున్నదన్నారు.

పలు పథకాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశామని తద్వారా గ్రామీణ యువతకు ఉపాధి కల్పన పెరుగుతున్నదన్నారు. పట్టణాల్లో ఉపాధి రంగాలను మెరుగుపరిచే కార్యక్రమాలను అమలు చేస్తూ వాటి ఫలాలను యువతకు అందించే స్థాయికి చేరుకున్నామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలితాలను రాష్ట్ర ప్రజలు దక్కించుకోవడం ఇప్పటికే ప్రారంభమైందని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. దండుగన్న వ్యవసాయం నేడు పండుగలా మారడమే అందుకు ఉదాహరణ అని సిఎం స్పష్టం చేశారు. వ్యవసాయ రంగం నేటి యువతను కూడా ఆకర్షిస్తుండడం వెనక రాష్ట్ర ప్రభుత్వ శ్రమ ఎంతో ఉన్నదన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News