Monday, April 29, 2024

కంటోన్మెంట్ రోడ్ల మూసివేత ఆపండి

- Advertisement -
- Advertisement -

Cantonment roads do not closed

 

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కెటిఆర్ లేఖ
ఎన్ని లేఖలు రాసినా స్థానిక మిలటరీ అధికారుల తీరు మారడం లేదు
సికింద్రాబాద్‌లోని కీలకమైన నాలుగు కంటోన్మెంట్ రోడ్లను కొవిడ్ పేరు చెప్పి లోకల్ మిలటరీ అథారిటీ మూసివేసింది
దీనివల్ల రోజు లక్షలాది ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతున్నది
అనేక కిలోమీటర్లు అదనంగా తిరిగి ఇళ్లకు వెళ్లవలసి వస్తోంది
రాష్ట్రంలో కరోనా అదుపులో ఉన్నా సైనిక అధికారులు గేట్లను మూసివేయడం అన్యాయం, అసంబద్ధం : లేఖలో మంత్రి కెటిఆర్

 

హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఉన్న లోకల్ మిలిటరీ అథారిటీ రోడ్లను ఇష్టారీతిన మూసివేయడంతో లక్షలాది మంది నగర వాసులకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కంటోన్మెంట్ రోడ్లు మూసివేయకుండా స్థానిక మిలటరీ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ని  తెలంగాణ రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటిఆర్ కోరారు. ఈ రోడ్ల మూసివేత అంశానికి సంబంధించి పలుమార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చామని, గతంలోనూ ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని లేఖలు రాసిన విషయాన్ని ఈ సందర్భంగా కెటిఆర్ గుర్తు చేశారు. తాజాగా లోకల్ మిలిటరీ అథారిటీ తన పరిధిలో ఉన్న కీలకమైన అలహాబాద్ గేట్ రోడ్డు, గాఫ్ రోడ్, వెలింగ్ టన్ రోడ్, ఆర్డినెన్స్ రోడ్ వంటి కీలకమైన నాలుగు రోడ్లను కోవిడ్ కేసుల పేరు చెప్పి మూసి వేసిందని, ఈ మూసివేతతో లక్షలాదిమంది ఇబ్బందులు పడ్డారని కెటిఆర్ తెలిపారు.

పదే పదే ఇలా రోడ్లను మూసివేయడంతో నగర ప్రజలు అనేక కిలోమీటర్లు అదనంగా తిరిగి తమ ఇళ్లకు చేరుకుంటున్నారని కెటిఆర్ పేర్కొన్నారు.  తెలంగాణ ప్రభుత్వం మే, జూన్ నెలల్లో తీసుకున్న కొవిడ్ నియంత్రణ చర్యల వలన రాష్ట్రంలో కరోనా కేసులు చాలా వరకు తగ్గాయని, ప్రస్తుతం అదుపులో ఉన్న కరోనా పేరు చెప్పి తాజాగా మరోసారి రోడ్ల మూసివేతకు పాల్పడడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. లోకల్ మిలటరీ అథారిటీ, స్థానిక కంటోన్మెంట్ బోర్డుకి సంబంధం లేకుండా రోడ్ల మూసివేతకు పాల్పడుతోందని, కంటోన్మెంట్ యాక్ట్ లో ఉన్న సెక్షన్ 258 కి ఇది పూర్తి విరుద్ధమని కెటిఆర్ తన లేఖలో రాజ్ నాథ్ సింగ్ కు గుర్తు చేశారు. కంటోన్మెంట్ బోర్డు చట్టంలో పేర్కొన్న మార్గదర్శకాల మేరకు మాత్రమే రోడ్డు మూసివేసే ప్రక్రియ ఉండాలని, అయితే తమ ఇష్టారీతిన అత్యంత చిన్న చిన్న కారణాలు చూపి పదే పదే రోడ్ల మూసివేస్తున్నారని ఈ సందర్భంగా కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో ఈ అంశాన్ని  రక్షణ శాఖ దృష్టికి తీసుకురావడంతో కంటోన్మెంట్ బోర్డుకి సంబంధం లేకుండా రోడ్ల మూసివేతకు పాల్పడరాదని ఇచ్చిన ఆదేశాలను సైతం స్థానిక మిలిటరీ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఈ విధంగా రక్షణ శాఖ కింద పనిచేసే అధికారులే, తమ శాఖ నిర్దేశించిన మార్గదర్శకాలను, సూచనలను పట్టించుకోవడం లేదని కెటిఆర్ వాపోయారు. స్థానిక మిలిటరీ అధికారుల పరిధిలో ఉన్న రోడ్ల పైన ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు ఇప్పటికే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కార్యదర్శితో ఒక వీడియో కాన్ఫరెన్స్ జరిగిందని, ఆ సమావేశంలో ఇందుకు సూచన ప్రాయంగా అంగీకరించామని, ఈ దిశగా రక్షణ శాఖ తుది నిర్ణయం కోసం వేచి చూస్తున్నామని తెలిపారు. ఈలోగా మిలటరీ అధికారులు పదే పదే రక్షణ శాఖ ఆదేశాలను సైతం తుంగలో తొక్కుతున్నారని, ఈ విషయంలో రోడ్ల మూసివేయకుండ ఆదేశాలిచ్చి లక్షలాదిమంది హైదరాబాద్ నగర పౌరులకు ఊరట కల్పించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ని కెటిఆర్ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News