జిహెచ్ఎంసిలో 33, మరో 15 మంది వలసకూలీలు, నలుగురు విదేశీయులకు వైరస్
చిలకలగూడలో ఇద్దరు ఎస్ఐలకు, బోయిన్పల్లి కానిస్టేబుల్కు కరోనా
మహబూబ్నగర్లో 5 నెలల బాలుడికీ వైరస్
25 మంది డిశ్చార్జ్.. మరొకరి మృతి
1813కి చేరిన కరోనా పాజిటివ్ల సంఖ్య
యాదాద్రి, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో పెరుగుతున్న వలస కార్మికుల కేసులు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మరో 52 కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి పూర్తిస్థాయిలో కోలుకోని 25 మంది డిశ్చార్జ్ కాగా, వైరస్ దాడిలో మరోక వ్యక్తి మృతి చెందడం ఆందోళనకరం. అయితే మృతి చెందిన వారి వివరాలు బులిటెన్లో పేర్కొనలేదు. కొత్తగా వైరస్ సోకిన వారిలో జిహెచ్ఎంసిలో 33 మంది ఉండగా, మరో 15 మంది వలస కార్మికులకు, కువైట్ నుంచి రాష్ట్రానికి వచ్చిన నలుగురికి వైరస్ నిర్ధారణ అయిందని వైద్యారోగ్యశాఖ బులిటెన్లో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1813కి చేరగా, డిశ్చార్జ్ల సంఖ్య 1068కి పెరిగింది.
ప్రస్తుతం ప్రభుత్వ నోటిఫైడ్ ఆసుపత్రుల్లో 696 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు ప్రకటించారు. శనివారం కొత్తగా వైరస్ సోకిన వారిలో చిలకలగూడకి చెందిన ఇద్దరు ఎస్ఐలు, బోయిన్పల్లికి చెందిన మరో కానిస్టేబుల్ ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ పేర్కొంది. అదే విధంగా మహబూబాబాద్ జిల్లాల్లో 5నెలల బాలుడికి వైరస్ సోకడం బాధకరం. దీంతో పాటు మడిపల్లి గ్రామానికి చెందిన మరో ఇద్దరికి కరోనా సోకినట్లు ఆర్డీవో ఈశ్వరయ్య చెప్పారు. అదే విధంగా భూపాలపల్లిలో ఓ వృద్ధుడికి కరోనా నిర్ధారణ అయిందని అధికారులు చెప్పారు. దీంతో వీరి కుంటుంబ సభ్యులందరిని క్వారంటైన్ చేసినట్లు ఆ జిల్లా అధికారులు వెల్లడించారు.
రాష్ట్రంలో కోవిడ్ స్ట్రాటజీ…
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బాధితుల సంఖ్య 1813కి చేరగా, వీటిలో డిశ్చార్జ్ల సంఖ్య ఎక్కువగా ఉంది. శనివారం వరకు ఏకంగా 59 శాతంతో 1068 మంది పూర్తిస్థాయిలో ఆరోగ్యవంతులుగా ఇళ్లకు చేరగా, మరో 38 శాతంతో 696 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే మరణాల శాతం మాత్రం కేవలం 3 శాతంతో 49 మంది ఉన్నట్లు అధికారులు బులిటెన్లో ధ్రువీకరించారు. కోవిడ్ బాధితులందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.
మూడు జిల్లాల్లో వలస కూలీల భయం
లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా రాష్ట్రానికి వస్తున్న వలస కార్మికులతో వైరస్ వ్యాప్తి పెరుగుతుంది. ముఖ్యంగా యాదాద్రి, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో వలస కార్మికుల కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 119 మంది మైగ్రెంట్స్కు కరోనా సోకగా, వీటిలో యాదాద్రి, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు యాదాద్రి జిల్లాలో 35 మంది, జగిత్యాల 30, మంచిర్యాల 23 నల్గొండ 7, జనగాం 5, మహబూబాబాద్ 5, సిరిసిల్లా 4, నిజామాబాద్ 3, నిర్మల్ 2, ఖమ్మం 2, కరీంనగర్ 2, భూపాలపల్లి జిల్లాల్లో మరోక వలస కార్మికులకు వైరస్ సోకిందని అధికారికంగా ప్రకటించారు. వీటిలో ఎక్కువ మంది ముంబై నుంచి తిరిగి సొంత రాష్ట్రాలకు వచ్చినట్లు సమాచారం.