న్యూఢిల్లీ : విదేశీ టీకాలను దిగుమతి చేసుకోడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా త్వరలో 75 లక్షల మోడెర్నా టీకాలు భారత్కు చేరనున్నాయి. కొవాక్స్ కార్యక్రమం ద్వారా వీటిని అందజేయనున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గాలు వెల్లడించాయి. అయితే ఇవి ఎప్పుడు దేశానికి అందుతాయో స్పష్ఠం కాలేదు. విదేశీ టీకా సంస్థలకు సంబంధించి ఇండెమ్నిటీ అంశంపై అంటే నష్టపరిహారం సమస్యపై కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈమేరకు వ్యాక్సిన్ తయారీ సంస్థలు, ప్రభుత్వం మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.
ఇండెమ్నిటీ క్లాజుపై స్పష్టత వస్తే కానీ భారత్కు విదేశీ టీకాలు అందుబాటు లోకి వచ్చే అవకాశాలు లేవు. భారత్లో మోడెర్నా టీకా అత్యవసర వినియోగానికి కేంద్రం ఇటీవల ఆమోదం తెలిపింది. ఈ టీకా డోసులు దిగుమతి చేసుకోడానికి దేశీయ ఫార్మా సంస్థ సిప్లాకు అనుమతులు మంజూరు చేసింది. ఇండెమ్నిటీ మినహాయింపు కల్పించడానికి విదేశీ సంస్థలకు కొన్ని షరతులు విధిస్తామని కేంద్రం చెబుతోంది. మోడెర్నా డోసుల దిగుమతిపై కేంద్రం ఎప్పటికప్పుడు ఆ సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నట్టు నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వికె పాల్ ఇటీవల తెలిపారు.