పాజిటివ్లన్నీ జిహెచ్ఎంసి పరిధిలోనివే
ఒక్క జియాగూడలోనే 26 పాజిటివ్లు
భయాందోళనలో చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు
50 మంది డిశ్చార్జ్, 444 మందికి చికిత్స
14 రోజులుగా 26 జిల్లాల్లో కేసులు సున్నా
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ హైదరాబాద్ నగరాన్ని వణుకు పుట్టిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ శాతం జిహెచ్ఎంసి పరిధిలోనే రావడం ఆందోళనకరం.
సోమవారం ఒక్క రోజే 79 మందికి వైరస్ సోకగా, 50 మంది డిశ్చార్జ్ అయ్యారని అధికారులు పేర్కొన్నారు. అయితే పాజిటివ్లు వచ్చిన బాధితులంతా గ్రేటర్ హైదరాబాద్కి చెందిన వారు కావడం గమనార్హం. మిగతా జిల్లాల్లో ఒక్క కేసు కూడా రాలేదు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1275కి చేరగా, ఇప్పటి వరకు 801 మంది డిశ్చార్జ్ అయినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ప్రభుత్వ నోటిఫైడ్ ఆసుపత్రుల్లో 444 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
జియాగూడలో ఆందోళన…..
కార్వన్ నియోజకవర్గానికి చెందిన జియాగూడలో కరోనా టెర్రర్ సృష్టిస్తుంది. నిన్నటి వరకు ఎల్బినగర్ ఏరియాలో హడలేత్తించిన కరోనా, తాజాగా జియాగూడలో పరేషాన్ చేస్తుంది. సోమవారం ఈ ప్రాంతంలో ఏకంగా 26 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులతో పాటు, ప్రజలు సైతం భయాందోళనకు గురవుతున్నారు. దీంతో ఈ ఏరియాలోని షాపులన్నీ మూసివేయించి, ప్రజలు ఇళ్ల నుంచి బటయకు రావొద్దని పోలీసులు సూచించారు. దీంతో సిటీ సర్వత్రా టెన్షన్లో నెలకొంది.
14 రోజులుగా 26 జిల్లాల్లో కేసులు లేవు….
రాష్ట్రంలో 26 జిల్లాల్లో గత 14 రోజులుగా కొత్త కరోనా కేసులు నమోదు కాలేదని అధికారులు తెలిపారు. వీటిలో కరీంనగర్, సిరిసిల్లా, కామారెడ్డి, మహబూబ్నగర్, మెదక్, భూపాలపల్లి, సంగారెడ్డి, నాగర్కర్నూల్, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట్, మహబూబ్బాద్, మంచిర్యాల, భద్రాద్రి, వికారాబాద్, నల్గొండ, ఆసిఫాబాద్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, సూర్యాపేట్, నారాయణపేట్, వరంగల్ అర్బన్, జనగాం, గద్వాల్, నిర్మల్ జిల్లాలు ఉన్నాయి.