న్యూఢిల్లీ: పరీక్షల సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశంలో వివిధ ప్రాంతాల్లో విద్యార్థుల్ని కలుసుకొంటున్నారు. పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవడమే లక్ష్యం కాదని వ్యాఖ్యానించారు. ‘పరీక్షా పె చర్చా’ అనే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తమ సొంత భాషలోనే మాట్లాడాలని కోరారు. ప్రతి ఇంట్లోనూ సాంకేతికతతో సంబంధంలేని ఒక గది ఉండాలని, అక్కడికి ఎవరూ కూడా గాడ్గెట్లతో రాలేరని అన్నారు. తల్కటోరా స్టేడియంలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ‘సాంకేతికతను మన అదుపులో ఉంచుకునే శక్తి మనకుండాలి.
అది మన సమయాన్ని వృథా చేయకూడదు. ఆధునిక సాంకేతికతను అందరూ తెలుసుకోవాల్సిందే. కానీ, దాన్ని మన జీవితాలపై పెత్తనం చేయనివ్వకూడదు’ అని సలహా ఇచ్చారు. విద్యార్థులపై పూర్తిగా దృష్టిని కేంద్రీకరిస్తానని, వారు స్వేచ్ఛగా తనతో మాట్లాడవచ్చని మోడీ హామీ ఇచ్చారు. విద్యార్థులు తమ తీరిక సమయాన్ని పెద్దవాళ్లతో గడపమని ప్రధాని కోరారు. పరాజయానికి భయపడకూడదని, దాన్ని కూడా జీవితంలో భాగంగానే తీసుకోవాలని ఆయన హితవు పలికారు.