విజయ్ దేవరకొండ హీరోగా రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్, క్యాథరిన్, ఇసబెల్లా హీరోయిన్లుగా రూపొందుతున్న సినిమా ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ మీడియాతో మాట్లాడుతూ “మిర్చి అవార్డ్ ఫంక్షన్ కోసం 2018లో హైదరాబాద్కు వచ్చిన సమయంలో డైరెక్టర్ క్రాంతి మాధవ్ నాకు ఈ కథ చెప్పారు. నాకు కథ చాలా బాగా నచ్చింది. నిజంగా ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అందరికీ తప్పకుండా నచ్చుతుంది.
సినిమాలో అందరు హీరోయిన్లకు మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఇందులో ప్రతి పాత్ర కీలకమైనదే. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ చాలా కొత్తగా కనిపిస్తాడు. సినిమా చూశాక అసలు మన విజయ్ దేవరకొండేనా అనిపిస్తాడు. ఇక ఈ సినిమా కోసం నేను 25 రోజులు పనిచేశాను. విజయ్, నాకు మధ్య సీన్స్ బాగా వచ్చాయి. నెక్స్ట్ తెలుగులో నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాను. ఆ సినిమా తర్వాత నేను తెలుగు ప్రేక్షకులకు ఇంకా బాగా దగ్గరవుతాను”అని అన్నారు.