ఖమ్మం : చెరువులో మునిగి తండ్రీకొడుకు చనిపోయారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని గంపెళ్ళగూడెంలో శనివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం … గంపెళ్ళగూడెం గ్రామానికి చెందిన పిప్పల్ల సత్యనారాయణ (48) తన కొడుకు భరత్ (14)తో కలిసి బట్టలు ఉతకడం కోసం శనివారం ఉదయం చెరువు వద్దకు వెళ్లాడు. బట్టలు ఉతికి ఆరేసిన తరువాత భరత్ సరదాగా ఈత కొడదామని చెరువులోకి దిగాడు. దురదృష్టవశాత్తు భరత్ చెరువులో మునిగి పోతుండగా గమనించిన తండ్రి సత్యనారాయణ కొడుకును రక్షించుకోవాలనే తాపత్రయంతో మునుగుతున్న కొడుకును బయటకు తీసుకొద్దామని ప్రయత్నించాడు.
ఈ క్రమంలో కొడుకు కంగారుగా తండ్రిని ఒడిసి పట్టుకోవడంతో ఇద్దరు చెరువులో మునిగి చనిపోయారు. చెరువు నుంచి సత్యనారాయణ, భరత్ మృతదేహాలను వెలికి తీశారు. ఒకే రోజు తండ్రీకొడుకు చెరువులో మునిగి చనిపోవడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. ఘటనాస్థలిని కారేపల్లి ఎఎస్ఐ కృష్ణప్రసాద్ సందర్శించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు ఎఎస్ఐ తెలిపారు.