హైదరాబాద్: ఎన్పిఆర్ వల్ల ముస్లిములు, దళితులు, బడుగుబలహీన వర్గాలు నష్టపోతాయని టిఆర్ఎస్ బాల్కసుమన్ తెలిపారు. శాసన సభలో సిఎఎ, ఎన్సిఆర్, ఎన్పిఆర్ కు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా బాల్కసుమన్ మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చిన ఏడు దశాబ్దాల తరువాత తాము భారతీయులం అని నిరూపించుకోవాల్సిన దుస్థితి వచ్చిందని, మోడీ ప్రభుత్వం ఈ పరిస్థితి తీసుకొచ్చిందని మండిపడ్డారు. బిజెపి ప్రభుత్వం విభజన రాజకీయాలు చేస్తోందని, సిఎఎ వల్ల పేద వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడతారని, దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థను పట్టించుకోకుండా మోడీ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని ధ్వజమెత్తారు. సిఎం కెసిఆర్ బాటలో దేశం నడుస్తోందని, అన్ని వర్గాలను అక్కున చేర్చుకునే దిల్ ఇండియా కావాలన్నారు. కేంద్రం రైతుల కోసం ఒక్కటైనా మంచి పథకం తీసుకొచ్చిందా? అని ప్రశ్నించారు. ఎన్ఆర్సి, సిఎఎని కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని బాల్క సుమన్ డిమాండ్ చేశారు. సిఎఎ వ్యతిరేఖ తీర్మానానికి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.