చిన్నారికి హార్పిక్, ఆలౌట్ తాగించి హతమార్చి, చెట్టుకు ఉరేసుకున్న వివాహితలు
మేడ్చల్ జిల్లా జవహర్నగర్లో ఘటన
మృతులు కరీంనగర్ జిల్లా మరిపెల వాసులు
రేషన్ షాపుకు వెళ్లి ఆలస్యంగా రావడంతో మందలించిన భర్తలు
ఓ పాస్టర్ కుమారుడి సహాయంతో చర్చిలో బస?
మనతెలంగాణ/జవహర్నగర్ : మేడ్చల్ జిల్లా జవహర్నగర్లో సోమవారం దారుణం చోటుచేసుకుంది. జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఆర్మీ డెంటల్ కాలేజీ చెత్త డంపింగ్ యార్డు సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో చెట్టుకు ఉరేసుకొని ఇద్దరు మహిళలు ఆత్మహత్య చేసుకోగా, ఘటనాస్థలిలో చిన్నారి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన జవహర్నగర్లో తీవ్ర కలకలం రేపింది. కరీంనగర్ జిల్లాకు చెందిన వీరు కుటుంబ కలహాలతో గత నాలుగు రోజుల క్రితం ఇంట్లో ఎవరికి చెప్పకుండా జవహర్నగర్ కు వచ్చి జీవితంపై విరక్తితో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. వీరికి బండ్లగూడ రాజీవ్గృహకల్పకు చెందిన ఓ పాస్టర్ కొడుకు సహకరించినట్లు సమాచారం. స్థానికుల సమాచారం మేరకు మల్కాజిగిరి డిసిపి రక్షితామూర్తి, కుషాయిగూడ ఎసిపి శివకుమార్, జవహర్నగర్ ఇన్స్పెక్టర్ భిక్షపతిరావులు ఘటనాస్థలికి వచ్చి మృతదేహాల ను పరిశీలించి వివరాలు సేకరించారు.
ఎసిపి శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం… కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం మరిపెల గ్రామానికి చెందిన అరెకల సుమతి(29), కరీంనగర్ పట్టణానికి చెందిన శ్రీరాముల అనూష (25), అనూష కూతురు ఉమామహేశ్వరి(8)తో కలిసి నివసిస్తున్నారు. వీరి కుటుంబాల మధ్య స్నేహం ఉంది. ఈ రెండు కుటుంబాలు కరీంనగర్ పట్టణంలో నివసిస్తున్నాయి. అయితే ఈ నెల 9వ తేదిన రేషన్ బియ్యం కోసం వెళ్లిన ఇద్దరు మహిళలు ఇంటికి ఆలస్యంగా రావడంతో వారి భర్తలు మందలించారు. దీంతో మనస్తాపం చెంది న వారు శుక్రవారం చిన్నారి ఉమామహేశ్వరితో కలిసి శామీర్పేటకు వచ్చారు.
అక్కడి నుంచి బండ్లగూడ రాజీవ్గృహకల్పకు చెందిన ఓ పాస్టర్ కొడుకు సహకారంతో జవహర్నగర్లోని గబ్బిలాలపేటకు వచ్చి చర్చిలో ఉన్నట్టు తెలిసింది. ఆదివారం రాత్రి నిర్మానుష్య ప్రదేశానికి వచ్చి మొదట చిన్నారి ఉమామహేశ్వరికి కూల్డ్రింక్లో హార్పిక్,ఆలౌట్ కలిపి తాగించారు. చిన్నారి మృతి చెందిన అనంతరం వారిద్దరు చెట్టుకు చున్నీలతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనాస్థలి వద్ద సెల్ఫోన్,కూల్డ్రింక్ బాటిల్, బ్యాగ్ తదితర వస్తువులు లభ్యమయ్యాయి. చివరి ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులు ఆరా తీసి వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎసిపి శివకుమార్ తెలిపారు. పాస్టర్ కొడుకును అదుపులోకి తీసుకోని విచారణ చేపడుతామని ఎసిపి వెల్లడించారు.