న్యూఢిల్లీ: తీవ్ర అనారోగ్యంతో సోమవారం ఇక్కడి ఆర్మీ ఆస్పత్రిలో కన్ను మూసిన భారత మాజీ రాష్ట్రపతి, బారత రత్న దివంగత ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు సైనిక లాంఛనాల మధ్య మంగళవారం మధ్యాహ్నం పూర్తి సైనిక లాంఛనాలతో దివంగత మాజీ రాష్ట్రపతికి తుది వీడ్కోలు పలికారు. లోధీ శ్మశాన వాటికలో కుటుంబ సంప్రదాయాల ప్రకారం ప్రణబ్ కుమారుడు అభిజిత్ అంత్యక్రియలను నిర్వహించారు. కరోనా ప్రొటోకాల్ ప్రకారం పరిమిత సంఖ్యలో జనాన్ని అనుమతించారు. 10 రాజాజీ మార్గ్లోని ప్రణబ్ నివాసంనుంచి శమశాన వాటిక వరకు మృత దేహాన్ని సైనిక శకటంపై కాక ప్రత్యేక అంబులెన్స్లో తీసుకు వచ్చారు. కొవిడ్ నిబంధనల ప్రకారం పిపిఇ కిట్లు ధరించిన సైనికులు శవపేటికను మోశారు.
కాగా అంతకు ముందు ఉదయం రాజాజీ మార్గ్లోని ప్రణబ్ నివాసంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, త్రివిధ దళాధిపతులు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ప్రణబ్కు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్రమంత్రి హర్షవర్ధన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, కాంగ్రెస్ నేత గులాం పబీ ఆజాద్ సహా వివిధ పార్టీలకు చెందిన నేతలు ఇతర ప్రముఖులు ప్రణబ్ చిత్రపటం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. పెద్ద సంఖ్యలో జనం తమ ప్రియతమ నాయకుడి అంతిమ దర్శనం కోసం ఉదయం నుంచి క్యూలో మాస్కులు ధరించి, బొకేలు పట్టుకుని భౌతిక దూరాన్ని పాటిస్తే ఓపిగ్గా వేచి ఉన్నారు.
మధ్యాహ్నం 12 గంటల తర్వాత గార్డ్ ఆఫ్ ఆనర్ అనంతరం అంతిమయాత్ర ప్రారంభమైంది. ప్రణబ్ పార్థివ దేహంపై సైనికులు జాతీయ పతాకాన్ని ఉంచారు. మధ్యాహ్నం 2 గంటలకు లోధీ శ్మశాన వాటికలోని విద్యుత్ దహనవాటికలో అంత్యక్రియలు జరిగాయి. కార్యక్రమం ఆద్యంతం కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఏర్పాట్లు చేశారు. ‘ఆయన మా కుటుంబానికి పెద్ద అండ. ఆయన మరణానికి కోవిడ్19కన్నా బ్రెయిన్ ఆపరేషన్ కారణమని నేను అనుకొంటున్నా. నేను ఆయనను పశ్చిమ బెంగాల్కు తీసుకు వెళ్లాలని అనుకొన్నాను. కానీ ప్రస్తుత ఆంక్షల కారణంగా అలా చేయలేకపోయాను’ అని అంత్యక్రియల అనంతరం ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ ప్రణబ్ కుమారుడు అభిజిత్ అన్నారు.
గొప్ప నాయకుడ్ని కోల్పోయాం: కేంద్రమంత్రివర్గం నివాళి
దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కేంద్రమంత్రి వర్గం ఘనంగా నివాళి అర్పించింది. మంగళవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ప్రణబబ్ స్మృత్యర్థం రెండు నిమిషాలు మౌనం పాటించింది. ‘మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతిపట్ల కేబినెట్ ప్రగాఢ సంతాపం తెలియజేస్తోంది. ఆయన మృతితో దేశం ఒక గొప్ప నాయకుడ్ని, ఒక అసాధారణ పార్లమెంటేరియన్ను కోల్పోయింది’ అని అనంతంరం ఆమోదించిన ఒక తీర్మానంలో కేంద్ర మంత్రివర్గం పేర్కొంది. విదేశాంగ, రక్షణ, వాణిజ్య, ఆర్థిక మంత్రిగా కేంద్రంలో సుదీర్ఘకాలం పని చేసిన ప్రణబ్ పరిపాలనలో అసమాన అనుభవం గల వ్యక్తి అని మంత్రివర్గం ఆ తీర్మానంలో కొనియాడింది.
Ex President Pranab Mukherjee last rites